Publish Date: Tue, 24 May 2022 (12:11 IST)
Updated Date: Tue, 24 May 2022 (12:13 IST)
డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో వైకాపా ఎమ్మెల్సీ అనంతబాబుకు కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. వచ్చే నెల ఆరో తేదీ వరకు రిమాండ్లో ఉంచాల్సిందిగా కాకినాడ మేజిస్ట్రేట్ కోర్టు ఆదేశించింది. దీంతో ఆయనను రాజమండ్రి సెంట్రల్ జైలుకు తరలించారు.
అంతకుముందు ఆయనకు కాకినాడ ప్రభుత్వ ఆస్పత్రిలో ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా కోర్టులో దాదాపు గంటకు పైగా వాదనలు జరిగాయి. అనంతబాబుకు బెయిల్ ఇవ్వాలని ఆయన తరపు న్యాయవాది వాదించారు. కానీ మేజిస్ట్రేట్ ఆయన వాదనలు పరిగణలోని తీసుకోకుండా రిమాండ్కు తరలించారు.
మరోవైపు, సుబ్రహ్మణ్యం హత్య కేసుపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సుబ్రహ్మణ్యంను తానే హత్య చేసినట్టు అనంతబాబు అంగీకరించారు. కానీ, ఆయన కుటుంబ సభ్యులుమాత్రం సుబ్రమణ్యాన్ని వేరే వ్యక్తితో అనంత పిలిపించినట్లు చెబుతున్నారు.
పోలీసులు మాత్రం స్వయంగా అనంతబాబే అతన్ని తీసుకెళ్లినట్లు చెబుతున్నారు. పథకం ప్రకారం జరిగిన హత్య కాదంటున్నారు. అలాగే రాత్రి పదిన్నర గంటల సమయంలో శంకరటవర్స్ లాంటి జనం తిరిగే ప్రాంతంలో గొడవ జరిగిందని పోలీసులు అంటున్నారు. దానికి సంబంధించి ఆధారాలపై స్పష్టత లేదు.
అలాగే మృతుడి శరీరంపై ఇసుక ఉందని, నీళ్లలో నానిన ఆనవాళ్లున్నాయని కుటుంబసభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఇసుక ఎక్కడి నుంచి వచ్చిందన్నదానిపై స్పష్టత లేదు. అలాగే సుబ్రమణ్యం చేతులు వెనక్కు విరిచిన ఆనవాళ్లున్నట్లు చెబుతున్నారు. ఇది ఎలా జరిగిందన్నదానిపై క్లారిటీ లేదు.