వైకాపా సీనియర్ నేత సజ్జల రామకృష్ణారెడ్డిపై టీడీపీకి చెందిన నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మండిపడ్డారు. అమరావతి మహిళలను అవమానకర రీతిలో మాట్లాడిన సజ్జలను రామకృష్ణారెడ్డిని రాష్ట్రం నుంచి బహిష్కరించాలని డిమాండ్ చేశారు. అమరావతి మహిళలపై సజ్జల అనుచిత వ్యాఖ్యలు చేశారన్నారు. ఇది ఏమాత్రం క్షమించరానిదన్నారు.
ఇదే అంశంపై కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి మంగళవారం నెల్లూరులో విలేకరులతో మాట్లాడుతూ, గత ఎన్నికల్లో వైకాపాను కేవలం 11 సీట్లకే ఓటర్లు పరిమితం చేసినా వైకాపా నేతలకు మాత్రం ఇంకా బుద్ధిరావడం లేదన్నారు. ఇప్పటికీ రాష్ట్రంలో వైకాపా పాలన సాగుతున్న భ్రమల్లో జీవిస్తున్నారన్నారు.
రాజకీయ పిపీలకం సజ్జల రామకృష్ణారెడ్డి చేసిన వ్యాఖ్యలు అత్యంత నీచం. ఆయనను రాష్ట్ర బహిష్కరణ చేయాలి. ఇది రాష్ట్రానికి ఏమాత్రం శ్రేయస్కరం కాదు. సజ్జలా.. నువ్వు జగన్ గుమస్తావి. రాష్ట్ర రాజకీయాలు, ప్రజలతో సంబంధంలేని బంట్రోతువి. నీకు రాజకీయ విమర్శలు చేసే అర్హత లేదు అంటూ కోటంరెడ్డి మండిపడ్డారు.