మావోయిస్టు పార్టీకి దెబ్బమీద దెబ్బ తగులుతోంది. మావోయిస్టుల ఏరివేత కోసం భద్రతా బలగాలు చేపట్టిన కూంబింగ్ ఆపరేషన్లో ఆ పార్టీకి చెందిన పలువురు అగ్రనేతలు ప్రాణాలు కోల్పోతున్నారు. అలాగే, క్షేత్రస్థాయిలోనే అపార నష్టం వాటిల్లుతోంది. అనేకమంది మావోయిస్టులు చనిపోతున్నారు.
మావోల ఏరివేత కోసం కేంద్ర హోం శాఖ ఆపరేషన్ కగార్ను చేపట్టింది. ఇందులోభాగంగా, భద్రతా బలగాల నుంచి ముప్పేట నిర్బంధం, దాడులు పెరిగాయి. ఫలితంగా ఆ పార్టీ కకావికలమైపోయింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్కౌంటర్లలో వరుసగా అగ్రనేతల్ని కోల్పోతోంది. కేంద్ర కమిటీ సభ్యుడు, దండకారణ్య స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి, గెరిల్లా ఆపరేషన్లలో దిట్టగా పేరొందిన హిడ్మా తాజాగా మారేడుమిల్లి ఎన్కౌంటరులో మరణించటం ఆ పార్టీకి కోలుకోలేని దెబ్బగా చెప్పొచ్చు.
ఈ యేడాది జనవరి నుంచి ఛత్తీస్గఢ్, ఏపీ, తెలంగాణ, ఒడిశా రాష్ట్రాల్లో జరిగిన ఎన్కౌంటరులో ఆ పార్టీ కేంద్రకమిటీ కార్యదర్శి నంబాల కేశవరావు ఎలియాస్ బస్వరాజ్ సహా అనేకమంది కేంద్రకమిటీ సభ్యులను కోల్పోయింది. వరుసగా కేంద్ర కమిటీ సభ్యుల్ని, అగ్రనేతల్ని కోల్పోవడం ఆ పార్టీ మనుగడనే ప్రశ్నార్థకంగా మార్చేసింది. ఎన్కౌంటరులో ముఖ్య నేతలు వరసగా మరణిస్తుండడంతో కేంద్ర కమిటీలో చివరికి ఎనిమిది మందే మిగిలారు. వీరిలో ఆరుగురు తెలుగు రాష్ట్రాల వారు.
కీలక నేతల్ని కోల్పోయారిలా : జనవరి 21: కేంద్ర కమిటీ సభ్యుడు రామచంద్రారెడ్డి ప్రతాప్ రెడ్డి ఎలియాస్ చలపతి ఛత్తీస్గఢ్ - ఒడిశా సరిహద్దుల్లోని గరియాబంద్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మృతిచెందారు.
మే 21 : మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు ఎలియాస్ బస్వరాజ్ ఛత్తీస్గఢ్ని గుండెకోట్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో మరణించారు.
జూన్ 5 : ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలోని నేషనల్ పార్క్ ఏరియాలో జరిగిన ఎన్కౌంటరులో కేంద్ర కమిటీ సభ్యుడు తెంటు లక్ష్మీనర్సింహాచలం ఎలియాస్ సుధాకర్ మరణించారు.
సెప్టెంబరు 11 : గరియాబంద్ ప్రాంతంలో జరిగిన ఎదురుకాల్పుల్లో కేంద్ర కమిటీ సభ్యుడు మోడెం బాలకృష్ణ ఎలియాస్ మనోజ్, కేకేబీఎన్ డివిజన్ కార్యదర్శి అల్వాల్ చంద్రహాస్లు మృతిచెందారు.
సెప్టెంబరు 19 : కేంద్ర కమిటీ సభ్యుడు, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ కార్యదర్శి గాజర్ల రవి ఎలియాస్ ఉదయ్, ఏవోబీ స్పెషల్ జోనల్ కమిటీ సభ్యురాలు వీఆర్ఎల్ చైతన్య ఎలియాస్ అరుణలు అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం మండలం కింటకూరు సమీపంలో జరిగిన ఎన్కౌంటరులో చనిపోయారు.
సెప్టెంబరు 22 : కేంద్ర కమిటీ సభ్యులు కట్టా రామచంద్రారెడ్డి, కడారి సత్యనారాయణ రెడ్డిలు ఎన్కౌంటరులో ప్రాణాలు కోల్పోయారు.