Publish Date: Wed, 06 Nov 2019 (16:46 IST)
Updated Date: Wed, 06 Nov 2019 (16:50 IST)
ఏపీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి అవమానకరరీతిలో ఉద్వాసనకుగురైన ఎల్వీ సుబ్రహ్మణ్యం వచ్చే నెల ఆరో తేదీ వరకు సెలవు పెట్టారు. ఏపీ చీఫ్ సెక్రటరీ బాధ్యతల నుంచి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఆయనను అవమానకరరీతిలో తొలగించిన విషయం తెల్సిందే.
జగన్ సర్కారు తీసుకున్న ఈ నిర్ణయంతో అధికారులు తత్తరపాటుకు లోనయ్యారు. అదేసమయంలో ఏపీ తాత్కాలిక సీఎస్గా నిరబ్ కుమార్ను ఎంపిక చేసి, ఎల్వీని బాపట్లలోని హెచ్ఆర్డీ విభాగం డైరెక్టర్ జనరల్గా నియమించారు. ఇపుడు ప్రధాన కార్యదర్శి బాధ్యతలను తాత్కాలిక సీఎస్ నీరబ్ కుమార్కు ఎల్వీ సుబ్రహ్మణ్యం అప్పగించారు.
మరోవైపు, బాపట్లలో హెచ్ఆర్డీ డైరెక్టర్ జనరల్ బాధ్యతలను ఆయన స్వీకరించలేదు. వచ్చే నెల 6వ తేదీ వరకు ఆయన సెలవు పెట్టారు. ఎల్వీ సుబ్రహ్మణ్యంను సీఎస్ పదవి నుంచి బదిలీ చేస్తూ సోమవారం రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన సంగతి తెలిసిందే.