Publish Date: Thu, 08 Aug 2024 (10:15 IST)
Updated Date: Thu, 08 Aug 2024 (10:16 IST)
సాధారణంగా సముద్రంలో అల్పపీడనాలు ఏర్పడుతుంటాయి. కానీ, గురువారం మాత్రం విచిత్రంగా భూమిపై కూడా అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని విశాఖపట్టణం వాతావరణ శాఖ తెలిపింది. వాస్తవానికి ఐదు రోజుల క్రితం వెస్ట్ బెంగాల్, జార్ఖండ్ పరిసరాల్లో అల్పపీడనం ఏర్పడింది. ఇది బలపడి తీవ్ర వాయుగుండంగా మారింది. దీని ఫలితంగా మధ్య, ఉత్తర, వాయవ్య భారతదేశంలో విస్తారంగా వర్షాలు కురిశాయి.
తాజాగా ఇప్పుడు తూర్పు, మధ్య భారతదేశంలో మరో అల్పపీడనం ఏర్పడనుంది. బుధ ఉదయం పశ్చిమ బెంగాల్, జార్ఖండ్ పరిసరాల్లో ఆవరించిన ఉపరితల ఆవర్తనం సాయంత్రానికి జార్ఖండ్, ఉత్తర ఒరిస్సా, చత్తీస్గఢ్ పరిసరాల్లో కేంద్రీకృతమైంది. గుురవారం ఉదయానికి అదే ప్రాంతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ తెలిపింది.
ఈ ప్రభావం కారణంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని శ్రీకాకుళం, పార్వతీపురం, మన్యం అల్లూరి సీతారామరాజు జిల్లాల్లో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మరోవైపు, నైరుతి రుతుపవనాలు రాష్ట్రంలో ఓ మోస్తరుగా కదులుతున్నందున నిన్న అనేక చోట్ల ఉరుములు, పిడుగులతో కూడిన వర్షాలు పడ్డాయి. వచ్చే 24 గంటల్లో కోస్తా, రాయలసీమలలో పలుచోట్ల వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.