Publish Date: Sat, 04 Sep 2021 (19:58 IST)
Updated Date: Sat, 04 Sep 2021 (19:59 IST)
ఉత్తర, మధ్య బంగాళాఖాతంలో ఈ నెల 6వ తేదీన అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ తెలిపింది. అది పశ్చిమ బెంగాల్, బంగ్లాదేశ్ తీరంవైపు కదిలే సూచనలున్నా దాని ప్రభావం రాష్ట్రంపై ఉంటుందని పేర్కొంది.
దీనివల్ల 5వ తేదీ నుంచి 11వ తేదీ వరకు తీరప్రాంత జిల్లాల్లో ఓ మోస్తరు వర్షాలు పడతాయని తెలిపింది. ఉత్తరాంధ్రలో పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ఈ నెల 11న శ్రీకాకుళం జిల్లాలో భారీవర్షాలు పడతాయని వాతావరణశాఖ అధికారులు తెలిపారు.
మరోవైపు నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడిన ఉపరితల ఆవర్తనం సముద్ర మట్టానికి 1.5 నుంచి 4.5 కిలోమీటర్ల ఎత్తులో కొనసాగుతోంది. దీని ప్రభావం వల్ల 48 గంటల్లో రాష్ట్ర వ్యాప్తంగా తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని అధికారులు తెలిపారు.
ప్రధానంగా విశాఖపట్నం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం జిల్లాల్లో పలుచోట్ల భారీవర్షాలు కురిసే అవకాశం ఉన్నట్లు పేర్కొన్నారు.