Publish Date: Thu, 05 Aug 2021 (18:13 IST)
Updated Date: Thu, 05 Aug 2021 (18:15 IST)
కృష్ణా
నది పరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వరద ముంపు ఎప్పుడైనా సంభవించవచ్చని జిల్లా కలెక్టర్ జె.నివాస్ అధికారులను అప్రమత్తం చేశారు. పులిచింతల డ్యాం 16 వ గేట్ సాంకేతిక సమస్య తో ఊడిపోయింది. దీని స్థానంలో స్టాప్ లాక్ గేట్ ఏర్పాటు చేస్తారు.
ఇందుకు డ్యాంలో నీటి నిల్వ తగ్గించాల్సి వస్తోంది. లేని ఎడల ఆ నీటి ఒత్తిడి ఇతర గేట్లపై పడే అవకాశం ఉంది. ప్రకాశం బ్యారేజీకి 4 నుంచి 5 లక్షల క్యూసెక్కుల వరకు 8 నుంచి 12 గంటల స్వల్ప వ్యవధిలో ఫ్లాష్ష్ ఫ్లడ్ చేరనుంది. ఈ దృష్ట్యా అధికారులు, నదిపరివాహక ప్రాంత ప్రజలు అప్రమత్తంగా వుండాలని కలెక్టర్ హెచ్చరించారు.
పులిచింతల డ్యాం వద్ద ప్రస్తుతం ఔట్ ఫ్లో 2,00,804 క్యూసెక్కులు ఉండగా, ఇన్ ఫ్లో 1,10,000 క్యూసెక్కులు ఉంది. ప్రకాశం బ్యారేజీ వద్ద ఔట్ ఫ్లో 33,750 క్యూసెక్కులు కాగా, ఇన్ ఫ్లో 41,717 క్యూసెక్కులు ఉంది. ఈ సమయంలో అధికంగా నది నీరు పరివాహక ప్రాంతాల్ని ముంచెత్తే ప్రమాదం ఉందని కలెక్టర్ చెప్పారు. మరో పక్క నదీ పరివాహక ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వాగులు, వంకలు కాలువలు దాటే ప్రయత్నం చేయరాదన్నారు.