Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం
, మంగళవారం, 5 అక్టోబరు 2021 (15:23 IST)
తిరుమల శ్రీవారి ఆలయంలో మంగళవారం కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం శాస్త్రోక్తంగా జరిగింది. ఈ కార్య‌క్ర‌మంలో టిటిడి ఈవో డాక్ట‌ర్ కె.ఎస్‌.జ‌వ‌హ‌ర్‌రెడ్డి, అద‌న‌పు ఈవో ఎవి.ధ‌ర్మారెడ్డి పాల్గొన్నారు.
 
 ఈ సందర్భంగా ఈవో మీడియాతో మాట్లాడుతూ.. అక్టోబరు 7 నుండి 15వ తేదీ వ‌ర‌కు శ్రీ‌వారి వార్షిక సాల‌క‌ట్ల‌ బ్ర‌హ్మోత్స‌వాలను పుర‌స్క‌రించుకుని మంగ‌ళ‌వారం ఉద‌యం కోయిల్ ఆళ్వార్ తిరుమంజ‌నం నిర్వ‌హించిన‌ట్లు చెప్పారు.

సాధార‌ణంగా సంవత్సరంలో నాలుగుసార్లు ఉగాది, ఆణివార ఆస్థానం, బ్రహ్మోత్సవం, వైకుంఠ ఏకాదశి పర్వదినాల ముందు కోయిల్‌ ఆళ్వార్‌ తిరుమంజనం నిర్వహించడం ఆనవాయితీగా వ‌స్తోంద‌న్నారు. ఆలయంలోని ఆనందనిలయం మొదలుకొని బంగారువాకిలి వరకు, శ్రీవారి ఆలయం లోపల ఉప దేవాలయాలు, ప్రసాదాల పోటు, ఆలయ ప్రాంగణం, గోడలు, పైకప్పుతోపాటు పూజాసామగ్రిని శుద్ధి చేసినట్టు తెలిపారు.
 
కాగా, ఆలయంలో ఉదయం 6 నుండి 10 గంటల వరకు శుద్ధి కార్యక్రమాన్ని అర్చకులు ఆగమోక్తంగా నిర్వహించారు. ఈ సమయంలో స్వామివారి మూలవిరాట్టును వస్త్రంతో పూర్తిగా కప్పి వేశారు.

శుద్ధి పూర్తి అయిన అనంతరం నామకోపు, శ్రీ చూర్ణం, కస్తూరి పసుపు, పచ్చాకు, గడ్డ కర్పూరం, గంధం పొడి, కుంకుమ, కిచీలిగడ్డ తదితర సుగంధ ద్రవ్యాలు కలగలిపిన పవిత్ర పరిమళ జలాన్ని ఆలయం అంతటా ప్రోక్షణం చేశారు. అనంతరం స్వామివారి మూలవిరాట్టుకు కప్పిన వస్త్రాన్ని తొలగించి ప్రత్యేక పూజ, నైవేద్యం కార్యక్రమాలను అర్చకులు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఆ తరువాత భక్తులను దర్శనానికి అనుమతించారు.
 
ఈ కార్యక్రమంలో బోర్డు స‌భ్యులు పార్థసారథి రెడ్డి, మధుసూధన్ యాదవ్, డిఎల్‌వో రెడ్డెప్ప రెడ్డి, ఆలయ డెప్యూటీ ఈవో ర‌మేష్‌బాబు, విజివో బాలిరెడ్డి, ఇతర అధికారులు పాల్గొన్నారు.
 
శ్రీ‌వారి బ్రహ్మోత్సవాల దర్భ చాప, తాడు ఊరేగింపు
శ్రీవారి వార్షిక బ్రహ్మోత్సవాలలో ధ్వజారోహణంకు ఊప‌యోగించే దర్భ చాప, తాడును వ‌రా‌హ‌స్వామి అథితి గృహా‌ల వ‌ద్ద ఉన్న టిటిడి అట‌వీ విభాగం కార్యాల‌యం నుండి మంగ‌ళ‌వారం డిఎఫ్‌వో శ్రీ‌నివాసులు రెడ్డి, సిబ్బంది ఊరేగింపుగా శ్రీ‌వారి ఆల‌యానికి తీసుకొచ్చారు.
 
అనంత‌రం శ్రీ‌వారి ఆల‌యం రంగ‌నాయ‌కుల మండ‌పంలోని శేష‌వాహ‌నంపై దర్భతో తయారుచేసిన చాప, తాడును ఉంచారు. ఈ నెల 7వ తేదీ జరిగే ధ్వజారోహణంలో వీటిని ఉపయోగిస్తారు.
 
ధ్వజారోహణంకు ద‌ర్భ చాప, తాడు కీలకం
బ్రహ్మోత్సవాల ఆరంభానికి సూచికగా ధ్వజారోహణం నిర్వహిస్తారు. ఈ సందర్బంగా ధ్వజస్తంభం  మీదకు గరుడ పతాకం ఎగురవేసి ముక్కోటి దేవతలను బ్రహ్మోత్సవాలకు ఆహ్వానిస్తారు. రుత్వికులు వేద మంత్రాలతో దర్భ చాపను ధ్వజస్తంభం చుట్టూ చుడతారు.

దర్బతో పేనిన తాడును ధ్వజస్తంభంపై వరకు చుడతారు. వీటి తయారీ కోసం టిటిడి అటవీ శాఖ 10 రోజుల ముందునుంచే కసరత్తు చేస్తుంది. దర్బలో శివ దర్భ, విష్ణు దర్భ అనే రెండు రకాలు ఉండగా, తిరుమలలో  విష్ణు దర్బ ఉపయోగిస్తారు.
 
ఇందుకోసం వడమాల పేట పరిసర ప్రాంతమైన చెల్లూరు పంటకాలువల మీద పెరిగే ఈ దర్భను టిటిడి అటవీ సిబ్బంది సేకరిస్తారు. దీన్ని తిరుమలకు తెచ్చి తక్కువ ఎండలో వారం రోజులు ఎండబెడతారు. ఆ తరువాత దర్బను బాగా శుభ్రపరచి, చాప, తాడు తయారు చేస్తారు.

ధ్వజారోహణంకు 5.5 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పు చాప, 175 అడుగుల తాడు అవసరం అవుతాయి.  అయితే అటవీశాఖ ఈ సారి 7 మీటర్ల పొడవు, 2 మీటర్ల వెడల్పుతో చాప, 211 అడుగుల పొడవు తాడు సిద్ధం చేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

స్పెల్లింగ్ నేర్పస్తానంటూ విద్యార్థినిని గదిలోకి పిలిపించుకుని...