Publish Date: Mon, 19 Oct 2020 (20:09 IST)
Updated Date: Mon, 19 Oct 2020 (20:12 IST)
శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం కనకదుర్గమ్మ అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అవతారం లో భక్తులకు దర్శనమిస్తున్నారు.
అమెరికాలోని అట్లాంటాలో స్థిరపడిన విజయవాడకు చెందిన తాతినేని శ్రీనివాస్ లీలా దంపతులు సోమవారం 40 లక్షల రూపాయల విలువ కలిగిన కనకపుష్య హారాన్ని బహూకరించారు. ఇది తన పూర్వజన్మ సుకృతం, అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు.
ఏడువారాల నగలు విశిష్టతను ఆలయ అర్చకులు శాండల్య వివరిస్తూ వారంలో ఏడు రోజులు ప్రతిరోజు ఆయా గ్రహాల అధిపతుల ఆధారంగా గత ఆరు నెలల నుండి ఏడువారాల నగలను అలంకరించడం జరుగుతుందన్నారు.
ఆలయ ఈవో యం.వి.సురేష్ బాబు మాట్లాడుతూ ఏడువారాల నగలు చేయించేందుకు ముందుకు వచ్చే దాతలు తమను ముందుగా సంప్రదిస్తే వివరాలు తెలుపుతామన్నారు.
అన్నపూర్ణాదేవిగా కనకదుర్గమ్మ
దసర శరన్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా ఇంద్రకీలాద్రిపై కొలువై ఉన్న శ్రీ కనకదుర్గమ్మ వారు నిజ ఆశ్వయుజ శుద్ద చవితి నాల్గవ రోజైన మంగళవారం శ్రీ అన్నపూర్ణా దేవి అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారు.
నిత్యానందకరీ వరాభయకరీ సౌందర్య రత్నాకరీ
నిర్థూతాఖిల లోకపావనకరీ ప్రత్యక్ష మాహేశ్వరీ
ప్రాలేయాచల వంశపావనకరీ కాశీపురాధీశ్వరీ
భిక్షాం ధేహీ కృఫావలంబనకరీ మాతాన్నపూర్ణేశ్వరీ..
శ్రీ అన్నపూర్ణాదేవి అన్నమును ప్రసాదించే మాతృమూర్తి. అన్నం పరబ్రహ్మ స్వరూపం, అన్నం సర్వజీవనాధారం, అన్నం లేనిదే జీవులకు మనుగడ లేదు. శ్రీ అన్నపూర్ణాదేవి ఎడమ చేతిలో ఉన్న బంగారు పాత్రలో ఉన్న అమృతాన్నం, వజ్రాలు పొదిగిన గరిటతో తన భర్త అయిన ఈశ్వరునికే భిక్షను అందించే మహాతల్లి అన్నపూర్ణాదేవి.
సర్వపుణ్య ప్రదాయకం. లోకంలో జీవుల ఆకలిని తీర్చడం కన్నా మిన్న ఏదీ లేదు. అందుకే అన్ని దానాలు కన్నా అన్నదానం గొప్పదంటారు. ఒక్కసారి నిత్యాన్నదానేశ్వరి అలంకారంలో ఉన్న శ్రీ దుర్గమ్మను దర్శించి తరించడం.. అన్నాదులకు లోపం లేకుండా ఇతరులకు అన్నందానం చేసే సౌభాగ్యాన్ని పొందుతారు. శ్రీ అన్నపూర్ణాదేవిగా దుర్గమ్మ ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రి ఉత్సవాలు కన్నుల పండుగగా జరుగుతున్నాయి.
దీనిలో భాగంగా నాల్గో రోజైన మంగళవారం కనకదుర్గ అమ్మవారు అన్నపూర్ణ దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తున్నారు. సకల జీవరాశికి ఆహారం ప్రసాదించే అన్నపూర్ణ దేవి అలంకారాన్ని చూసేందుకు భక్తులు వేలాదిగా తరలివస్తారు. ఓ చేతిలో అక్షయపాత్ర, మరో చేతిలో గరిట పట్టుకుని ప్రజల ఆకలి దప్పులను తీర్చే తల్లిగా అన్నపూర్ణ దేవి రూపం భక్తుల్ని పరవశింప చేస్తుంది.