Publish Date: Mon, 13 Sep 2021 (16:23 IST)
Updated Date: Mon, 13 Sep 2021 (16:26 IST)
అనంతపురం జిల్లాలో జెసి బ్రదర్స్ గురించి తెలియని వారుండరు. అసలు వారిద్దరి రూటే సపరేటు. ఎప్పుడూ ఒకవిధంగా వార్తల్లో నిలుస్తూ ఉంటారు. ఒకరికొకరు పోటీలు పడి ఏదో ఒకటి మాట్లాడేస్తూ ఉంటారు. అది కాస్త సంచలనంగా మారుతోంది.
తాజాగా అనంతపురం మున్సిపల్ ఛైర్మన్ జె.సి.ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారాన్నే రేపుతున్నాయి. టిడిపి నేతలనే ఆలోచనకు గురిచేస్తున్నారు. ప్రస్తుతం ఎన్నికలు జరిగితే టిడిపి ఓటమి ఖాయమని తేల్చారు జె.సి.ప్రభాకర్ రెడ్డి.
టిడిపిని ప్రజలే కాదు కార్యకర్తలు కూడా నమ్మడం లేదు. పార్టీలో అభద్రతా భావం ఎక్కువైంది. ఇది అందరికీ సమస్యే. నేతల తీరు మారాలి. ఒకరిద్దరు తప్ప మిగిలిన వారు అంతా మా ఇష్టం అన్న విధంగా ప్రవర్తిస్తున్నారు.
మాజీ మంత్రి కాల్వ శ్రీనివాసులు ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు. అది పార్టీకి బాగా ఇబ్బంది కలిగించే అంశం. కాబట్టి ఇలాంటి నేతల్లో మార్పు రావాల్సిన అవసరం ఉందంటూ అభిప్రాయపడ్డారు జె.సి.ప్రభాకర్ రెడ్డి. టిడిపిలో ఉంటూ గతంలో చంద్రబాబుపై వీరు చేసిన వ్యాఖ్యలు దుమారం రేపితే ప్రస్తుతం టిడిపి అధికారంలోకి రాదంటూ మరోసారి వ్యాఖ్యలు చేయడంతో స్థానిక నేతల్లో ఆగ్రహాన్ని తెప్పిస్తున్నాయి.
గతంలోనే జెసి బ్రదర్స్ను పిలిచి చంద్రబాబు సున్నితంగా వార్నింగ్ ఇచ్చి పంపారు. పార్టీ గురించి అధినాయకుడు మాత్రం మాట్లాడేటప్పుడు ఆచితూచి మాట్లాడాలని స్వీట్ వార్నింగ్ ఇచ్చారు. కానీ కొన్నిరోజుల పాటు సైలెంట్గా ఉన్న వీరు మళ్ళీ అదే పంథాతో ముందుకు వెళుతున్నారు.