Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఇథియోపియా ప్రేమికురాలికి క‌డ‌ప పోలీసుల సాయం!

ఇథియోపియా ప్రేమికురాలికి క‌డ‌ప పోలీసుల సాయం!
విజ‌య‌వాడ‌ , శుక్రవారం, 27 ఆగస్టు 2021 (21:27 IST)
ప్రియుడి కోసం ఖండాలు దాటి, త‌న ఎల్లలు దాటి ఇండియాకు వచ్చింది. ఆ ప్రియుడు కాస్తా, అనారోగ్యంతో మరణించడంతో దిక్కు, మొక్కూ లేకుండా ఉన్న ఆ విదేశీయురాలికి క‌డ‌ప జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ స‌హాయం చేశారు. పోలీసుల చొరవతో త‌న స్వదేశమైన ఇథియోపియాకు శుక్రవారం ఉదయం చేరుకుంది ఆ ప్రేమికురాలు. 
 
రాజంపేట కు చెందిన కామినేని నారాయణ కువైట్ లో డ్రైవర్ గా పనిచేసేవాడు. అక్కడే పనిచేస్తున్న ఇథియోపియాకు చెందిన యువతి ఏమనాభిర్హన్ అత్సేదే సెటయే(33) పరస్పరం ఇష్టపడి పెళ్లి చేసుకోవాలనుకున్నారు. దీంతో అక్టోబర్ 15 , 2015  సామ్. లో ఏమనాభిర్హన్ అత్సేదే సెటయేను రాజంపేటకు తీసుకువచ్చి ఒక అద్దె ఇంటిలో ఉంచాడు. ఆర్ధిక సమస్యల కారణంగా కొద్ది రోజుల తర్వాత పెళ్లి చేసుకుంటానని, మరో మారు కువైట్ దేశానికి ఉపాధి నిమిత్తం వెళ్ళాడు. అప్పటి నుండి నెల నెలా ఏమనాభిర్హన్ అత్సేదే సెటయేకు డబ్బులు పంపించేవాడు. కాలక్రమంలో యువతి వీసా గడువు ముగిసినప్పటికీ ఎవ్వరిని కలవాలో తెలియని నిస్సహాయ స్థితిలో ఉండేది. 
 
తీరా ప్రియుడు కామినేని నారాయణ కువైట్ లో గుండె పోటు తో మరణించడంతో మరింత కృంగిపోయింది. ప్రియుడు నారాయణ మృతదేహాన్ని రాజంపేటకు పంపగా, గత ఏడాది మార్చి 6 న అంత్యక్రియలు పూర్తి చేశారు. విధి తనపై ఇంతగా పగ బట్టిందా, అనుకుంటూ తీవ్ర మానసిక వేదన అనుభవించింది. తినడానికి తిండి కూడా లేక, ఏమి చేయాలో తెలియక, ఆదరించే వారు లేక నరక యాతన అనుభవించింది. ఈ నేపథ్యంలో చుట్టుప్రక్కల వారి ద్వారా జిల్లా స్పెషల్ బ్రాంచ్ కార్యాలయం లో ఉన్న ఫారెనర్స్ రిజిస్ట్రేషన్ ఆఫీస్ (ఎఫ్.ఆర్.ఒ) చేరుకొని జిల్లా ఎస్.పి శ్రీ కే.కే.ఎన్ అన్బురాజన్ ఐ.పి.ఎస్ గారిని కలిసి తన గోడు వెళ్లబోసుకుంది. తనను తన దేశం ఇథియోపియా కు పంపించాలని ప్రాధేయపడింది.
 
తక్షణం స్పందించిన జిల్లా ఎస్.పి కే.కే.ఎన్ అన్బురాజన్ తగిన చర్యలు తీసుకోవాలని స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ యు.వెంకట కుమార్ కు అప్పగించారు. ఇన్స్పెక్టర్ వెంకట కుమార్ ఆధ్వర్యంలో స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ జి.సుబ్బరాజు ఇథియోపియా దేశానికి చెందిన ఎంబసీ అధికారులతో సంప్రదింపులు, ఉత్తర ప్రత్యుత్తరాలు జరుపుతూ, మరోవైపు యువతిని ప్రియుడు నారాయణ తల్లిదండ్రుల సంరక్షణలో ఉంచారు.
 
అనుకోకుండా కొద్ది నెలల క్రిందట ఆ యువతికి  కోవిడ్ సోకడంతో కష్టాలు మరింత అధికమయ్యాయి. యువతికి కోవిడ్ నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ అండగా నిలిచింది. జిల్లా ఎస్.పి అన్బురాజన్ ఆమెకు కోవిడ్ చికిత్సకు అవసరమైన మెడికల్ కిట్ ను అందచేసి డాక్టర్ల పర్యవేక్షణలో చికిత్స అందచేయడంతో కోవిడ్ నుండి కోలుకుంది.

అనంతరం జిల్లా ఎస్.పి నిరంతరం పర్యవేక్షిస్తూ న్యూఢిల్లీ లోని ఎంబసీ అధికారులతో సంప్రదింపులు జరుపుతూ, ఎమర్జన్సీ ట్రావెల్ డాక్యుమెంట్ (E.T.D) ద్వారా శుక్రవారం తెల్లవారుఝామున ముంబై ఎయిర్ పోర్ట్ నుండి ఇథియోపియా రాజధాని అడిస్ అబాబాకు క్షేమంగా పంపారు. కడప నుండి ప్రత్యేక ఎస్కార్ట్ తో రైలులో ముంబై కు బయల్దేరి శుక్రవారం తెల్లవారు ఝామున విమానంలో స్వదేశానికి చేరుకుంది. స్వదేశానికి చేరుకున్న తర్వాత ఉద్వేగ భరిత వాతావరణంలో కుటుంబ సభ్యుల చెంతకు చేరింది.
 
ముంబై ఎయిర్ పోర్ట్‌కు వెళ్లేముందు జిల్లా ఎస్.పి అన్బురాజన్‌ని కలిసి ఇథియోపియా యువతి  ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియచేసింది. ఉద్వేగానికి లోనై కన్నీరు పెట్టుకుంది. జిల్లా ఎస్.పి చేసిన సాయాన్ని ఎన్నటికీ మరువలేనని, జన్మ జన్మలకు జిల్లా పోలీసు శాఖకు రుణపడి ఉంటానని ఏమనాభిర్హన్ అత్సేదే సెటయే పేర్కొంది. ధైర్యంగా ఉండాలని, స్వదేశానికి వెళ్లి మంచి జీవితాన్ని జీవించాలని ఎస్.పి ఆకాంక్షించారు. స్వదేశానికి చేరుకున్న అనంతరం తన క్షేమ సమాచారాన్ని జిల్లా ఎస్.పికి తెలిపి మరోసారి ధన్యవాదాలు తెలియచేసింది.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ పర్యాటకులను ఆకర్షించేలా రుషికొండకు హంగులు: రజత్ భార్గవ