Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్‌కు తొలి బాధితుడిని నేనే... ఐఏఎస్ మాజీ అధికారి పీవీ రమేశ్

pv ramesh

ఠాగూర్

, మంగళవారం, 7 మే 2024 (15:34 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఏపీ ల్యాండ్ టైటలింగ్ యాక్ట్ 2022కు తానే తొలి బాధితుడిని అని ఏపీ సీఎంవోలో కీలక అధికారిగా పని చేసిన మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేశ్ అన్నారు. ఇదే అంశంపై ఆయన ట్విటర్ ఖాతాలో ఓ ట్వీట్ చేశారు. "నేను ఏపీ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ప్రత్యక్ష బాధితుడిని. కృష్ణా జిల్లా విన్నకోట గ్రామంలో చనిపోయిన నా తల్లిదండ్రుల పట్టా భూములను మ్యుటేషన్ చేసేందుకు రెవెన్యూ అధికారులు నిరాకరించారు. తహశీల్దార్ నా దరఖాస్తును తిరస్కరించారు. ఆర్డీఓ పోస్ట్ ద్వారా పంపిన పత్రాలను తెరవకుండానే తిరిగి ఇచ్చేశారు. చట్టం అమలులోకి రాకముందే నా తల్లిదండ్రుల భూములపై నాకు హక్కులు నిరాకరించబడుతున్నాయి. ఐఏఎస్ అధికారిగా 36 ఏళ్ల పాటు ఆంధ్రప్రదేశ్‌కు సేవలందించిన ఓ అధికారి పరిస్థితి ఇలా ఉంటే, సామాన్య రైతుల దుస్థితిని ఊహించలేం" అంటూ వ్యాఖ్యానించారు. 
 
అయితే, ఈ వ్యాఖ్యలను మాజీ మంత్రి పేర్ని నాని ఖండించారు. పీవీ రమేశ్ కృష్ణా జిల్లా విన్నకోట గ్రామానికి చెందినవారని, ఆయన తండ్రి సుబ్బారావు మాస్టారు, మరికొందరు కలిసి 70 ఎకరాల భూమి కొని అందులో చెరువు తవ్వి లీజుకు ఇస్తున్నారని పేర్ని నాని వెల్లడించారు. పీవీ రమేశ్ తండ్రి ఏడాది క్రితం మరణించారని తెలిపారు. తండ్రి మరణానంతరం పీవీ రమేశ్ ఆ చెరువు భూమి మ్యుటేషన్‌కు ప్రయత్నించారని, అయితే, చెరువు కోసం సేకరించిన భూమి అయినప్పటికీ, కొంత వ్యవసాయ భూమి కూడా ఉండడంతో రెవెన్యూ అధికారులు బహిరంగ విచారణ జరిపారని వెల్లడించారు.
 
అందరు రైతులు ఒరిజినల్ డాక్యుమెంట్స్ తీసుకువస్తే, పీవీ రమేశ్ మాత్రం తన వద్ద పనిచేసే వ్యక్తితో జిరాక్స్ కాపీలు పంపించాడని పేర్ని నాని ఆరోపించారు. కానీ అధికారులేమో ఒరిజినల్ పత్రాలు కావాలంటున్నారని, ఆ విధంగా ఆ భూమి వివాదం ఇంకా పరిష్కారం కాలేదని తెలిపారు. ఆ చెరువు భూమిలో భాగస్వామిగా ఉన్న గాలంకి నాగేంద్ర అనే వ్యక్తికి, పీవీ రమేశ్‌కు మధ్య కోర్టు కేసులు కూడా నడుస్తున్నాయని పేర్ని నాని వివరించారు. అసలు విషయం ఇదీ... మరి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్‌కు, మీ భూమి వివాదానికి ఏమిటి సంబంధం? అని పీవీ రమేశ్‌ను పేర్ని నాని ప్రశ్నించారు. అక్కడున్న భూమి విస్తీర్ణం కంటే, పీవీ రమేశ్ అధిక లీజు పొందుతున్నారని స్థానిక రైతులే ఆరోపిస్తున్నారని, దీనికి పీవీ రమేశ్ ఏం సమాధానం చెబుతారని నిలదీశారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

ప్రపంచ ఆస్తమా దినోత్సవం.. ఆస్తమాతో మెదడుకు దెబ్బ..