Publish Date: Tue, 13 Sep 2022 (14:10 IST)
Updated Date: Tue, 13 Sep 2022 (14:13 IST)
భారీ వర్షాలకు విజయనగరం జిల్లా, గజపతినగరం మండలం మర్రివలస దగ్గర చంపావతి నదిలో ఒక్కసారిగా భారీగా వరద నీరు వచ్చి చేరుతోంది. ఈ సందర్భంగా విజయనగరం జిల్లాలో హాస్టల్ వార్డెన్ పెద్ద సాహసం చేశారు.
సొంత పనుల మీద స్వగ్రామానికి వచ్చిన ఆమె వార్డెన్ హాస్టల్లోని విద్యార్థుల పరిస్థితి గురించి ఆలోచించారు. ఆ వెంటనే తన సోదరుల సాయంతో నది దాటి ఒడ్డుకు చేరారు. ప్రాణాలకు తెగించి విద్యార్థుల గురించి ఆలోచించిన వార్డెన్ కళావతి ప్రస్తుతం నెట్టింట సెలెబ్రిటీగా మారిపోయారు.
మరోవైపు విజయనగరం జిల్లా గజపతి నగరం మండలం, మర్రివలస వద్ద చంపావతి నది ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో నదికి అవతల వున్న ఏడు గిరిజన గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రామం నుంచి మండల కేంద్రానికి చేరుకోవడానికి నదిని దాటుతూ నానా అవస్థలు పడుతున్నారు.
మంగళవారం చంపావతి నదిని దాటేందుకు విద్యార్థులు ఇబ్బందులు పడ్డారు. చంపావతి నదిని దాటడం కోసం నాటు బల్లుతో విద్యార్థులను నదిని దాటించారు.
మర్రివలస గ్రామం నుంచి చంపావతి నదిని దాటుతూ గజపతినగరం, మెంటాడ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలకు, ప్రైవేట్ పాఠశాలలకు దాదాపు 75మంది విద్యార్థులు వెళ్తున్నారు. ఈ నదిపై బ్రిడ్జి లేకపోవడంతో ప్రతిరోజూ విద్యార్థులు ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.