Publish Date: Thu, 01 Nov 2018 (09:15 IST)
Updated Date: Thu, 01 Nov 2018 (09:16 IST)
'ఆపరేషన్ గురడ'తో రాష్ట్ర రాజకీయాల్లో ప్రకంపనలు పుట్టించిన టాలీవుడ్ హీరో శివాజీ. గత కొంత కాలంగా సినీ అవకాశాలు లేక ఇంటికే పరిమితమయ్యారు. కానీ, ఆపరేషన్ గరుడ కారణంగా వార్తల్లో ప్రముఖంగా నిలుస్తున్నారు. ఈ క్రమంలో ఆయన తన మనసులోని మాటను వెల్లడించారు.
ఆయన తాజాగా ఓ టీవీ చానెల్ చర్చా కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, తాను చచ్చిపోయేలోపు తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఛైర్మన్ (తితిదే ఛైర్మన్) అవుతానని ధీమా వ్యక్తంచేశారు. భగవంతుడు తనకు ఆ అవకాశం కల్పిస్తాడని తాను బలంగా నమ్ముతున్నట్టు చెప్పారు.
పైగా, తితిదే ఛైర్మన్ అవ్వాలనేది తన చిన్నతనం కోరిక అని చెప్పారు. 'వెంకటేశ్వరస్వామికి నేను పరమ భక్తుడిని. వెంకటేశ్వరస్వామి ఆలయంలో జరుగుతున్న అవకతవకలపై నుంచే పోరాటం ప్రారంభించా. ఇప్పుడు తితిదే క్లియర్గా, ఆహ్లాదకరంగా తయారైంది. టీటీడీని రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నారు. టీటీడీని ఏమీ చేయలేరు. ఆ స్వామికి ఏం కావాలో అవి చేయించుకుంటాడు.
వైఎస్.రాజశేఖర్ రెడ్డి హయాంలో ఫారెస్ట్ ఇబ్బందులు ఉన్నాయని ఆ రోజుల్లో ఒక చర్చ జరిగింది. ఫారెస్ట్ అనుమతులు క్లియర్ చేసి అక్కడునున్న డ్యామ్ వాటర్ను పెంచితే భక్తులకు మంచి జరుగుతుంది. ప్రస్తుతం దళారీ వ్యవస్థను తగ్గించాలి. వైకుంఠ దర్శనం రోజు.. రాజకీయ నాయకుడు ఒకసారి దర్శనం చేసుకున్న తర్వాత అతనికి కాని, అతని కుటుంబానికి మళ్లీ టికెట్ ఇవ్వకూడదు. ఆ అవకాశం భక్తులకు ఇవ్వాలి' అని శివాజీ అభిప్రాయపడ్డారు.