Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

చీటింగ్ లవర్ : అలా మోసపోయిన విద్యార్థిని... బంగారు గాజుల ఇష్యూలో ఖాకీలు!!

చీటింగ్ లవర్ : అలా మోసపోయిన విద్యార్థిని... బంగారు గాజుల ఇష్యూలో ఖాకీలు!!
, మంగళవారం, 14 జులై 2020 (12:14 IST)
గుంటూరు జిల్లా నరసారావు పేటలో ఓ ఇంజనీరింగ్ విద్యార్థిని బ్లాక్ మెయిల్ చేసిన ఘటనలో ప్రధాన నిందితుడైన శివానంద్ అనే యువకుడిని పోలీసులు అరెస్టు చేశారు. అయితే, శివానంద్‌కు సహకరించిన నరసారావుపేట రెండో పట్టణ పోలీస్ స్టేషనులో పని చేసే అప్పల నాయుడు, శ్రీనివాస్ అనే ఇద్దరు కానిస్టేబుళ్ళ పాత్రపై మాత్రం పోలీసులు ఆరా తీయకుండా మిన్నకుండిపోయారు. దీంతో ఈ కేసులో పలు అనుమానాలకు తావిస్తోంది. 
 
ఈ వివరాలను పరిశీలిస్తే, గుంటూరు జిల్లా వినుకొండ మండలం జంగాలపల్లికి చెందిన శివానంద్ అనే విద్యార్థి... నరసారావుపేట ఇంజనీరింగ్ కాలేజీకి చెందిన ఓ యువతిపై కన్నేశాడు. ప్రేమ అంటూ వెంటపడ్డాడు. చివరకు అతని మాయమాటలకు నమ్మిన యువతి... శివానంద్ వలలో పడింది. ఓ రోజు మీటూ అంటూ ఓకే చెప్పేసింది. కొంతకాలం చెట్టాపట్టాలేసుకుని తిరిగేశారు. 
 
ఆ తర్వాత తన ప్లాన్‌ను శివానంద్ అమలు చేశాడు. యువతి నుంచి డబ్బులు వసూలు చేయసాగాడు. అలా రూ.2 లక్షల వరకు లాగేశాడు. బుల్లెట్ కొనాలి ఇస్తావా చస్తావా అంటూ బెదిరింపులకు దిగాడు. ఇక చేసేది లేక ఆ యువతి తన బంగారు గాజులు ఇచ్చింది. గాజులు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు నిలదీశారు. దీంతో గాజులు వెనక్కి ఇచ్చేయాలంటూ ఒత్తిడి చేయసాగింది. 
 
అంతే.. శివానంద్ పత్తాలేకుండా పోయాడు. మెసేజ్ లేదు ఫోను లేదు. అసలు మనిషే కనిపించకుండాపోయాడు. చివరకు ఎలాగోలా కనిపెట్టి అతనితో మాట్లాడితే, సోషల్ మీడియాలో ఫోటోలు పెడతా, మీ నాన్నను చంపేస్తానంటూ బెదిరించసాగాడు. ఆ తర్వాత తాను మోసపోయానని గ్రహించి నరసారావుపేట 2వ పట్టణ పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. 
 
ఈ బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదులో అదే స్టేషనులో పని చేసే ఇద్దరు కానిస్టేబుళ్లు అప్పల నాయుడు, శ్రీనివాస్ పేర్లను కూడా చేర్చారు. ఎందుకంటే.. శివానంద్‌కు అప్పల నాయుడు మంచి స్నేహితుడు. గాజులు చేతులు మారే సమయంలో శివానంద్ సొంతూరులో ఉండగా, గాజులు అప్పల నాయుడుకి ఇవ్వాలని శివానంద్ యువతికి చెప్పాడు. అప్పల నాయుడు.. మరో కానిస్టేబుల్ శ్రీనివాస్‌ను పంపి గాజులు తెప్పించాడు. 
 
అలా ఈ ఇద్దరు కానిస్టేబుళ్లు బంగారు గాజుల ఇష్యూలో ఎంటరయ్యారు. కానీ, పోలీసులు మాత్రం ఈ ఇద్దరు కానిస్టేబుళ్ళ వ్యవహారంపై స్పందించలేదు. దీంతో పలు అనుమానాలకు తావిస్తోంది. దీనిపై నరసారావుపేట డీఎస్పీ వీరా రెడ్డి స్పందిస్తూ... ఇద్దరు కానిస్టేబుళ్ళ పాత్రపై విచారణ జరుపుతున్నామని, ఇందులో వారి పాత్ర ఉందని తెలిస్తే వారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో తొమ్మిది లక్షలు దాటిన కరోనా కేసులు