Publish Date: Thu, 19 Mar 2020 (10:25 IST)
Updated Date: Thu, 19 Mar 2020 (10:27 IST)
దొంగబాబాలను నమ్మొద్దు అని మొత్తుకుంటున్నా.. జనాలు మాత్రం బాబాల వెంట పడుతున్నారు. ఆపై వేధించారంటూ పోలీసులను ఆశ్రయిస్తున్నారు. నమ్మకాన్ని క్యాష్ చేసుకుంటూ కాలం గడుపుతూ వచ్చిన ఓ దొంగ బాబా.. తన వద్దకు వచ్చే మహిళా భక్తుల వద్ద అసభ్యంగా ప్రవర్తించాడు. దీంతో ఓ మహిళ అతని బండారాన్ని బయటపెట్టింది.
వివరాల్లోకి వెళితే.. పాతబస్తీ శాస్త్రిపురం రోషన్ కాలనీలో అబ్దుల్ హాజీ(55) ఆటో నడుపుకుంటూ జీవనం సాగించేవాడు. ఆటో నడపడం ద్వారా వచ్చే డబ్బులు సరిపోకపోవడంతో ఏలాగైనా డబ్బులు సంపాదించాలనే ఉద్దేశంతో తన ఇంట్లోనే బాబా అవతారమెత్తాడు.
తక్కువ కాలంలోనే భక్తులు నమ్మి రావడం మొదలెట్టారు. వారి కష్టాలను ఆసరాగా చేసుకుని డబ్బులు గుంజడం మొదలుపెట్టాడు. మహిళా భక్తులతోనూ అసభ్యంగా ప్రవర్తించేవాడు. ఇటీవల స్థానికంగా ఉండే ఓ యువతిని నమ్మించి గదిలోకి పిలిచి అసభ్యంగా ప్రవర్తించాడు. సదరు యువతి బాబాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు బాబాను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు.