Publish Date: Wed, 17 Feb 2021 (08:15 IST)
Updated Date: Wed, 17 Feb 2021 (08:16 IST)
చిత్తూరు జిల్లాకు ఏనుగుల బెడద పట్టుకుంది. జిల్లాలోని పలు ప్రాంతాల్లోకి చొచ్చుకొస్తున్న ఏనుగులు.. మనంషులపై దాడి చేస్తున్నాయి. పుత్తూరు, వడమాలపేట మండలాల ప్రజలను భయభ్రాంతులకు గురిచేసిన గజరాజులు మంగళవారం నారాయణవనం మండలంలో ప్రవేశించాయి.
ఈ నేపథ్యంలో వీటి దాడులకు ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. వేకువజామున నారాయణవనం మండలం బొప్పరాజుపాళెం ఎస్టీ కాలనీ ప్రాంతంవైపు ఏనుగుల గుంపు వచ్చింది. అదే సమయంలో బహిర్భూమికి వెళ్లిన స్థానికులు సుబ్బరాయులు, సుబ్రహ్మణ్యంపై ఓ ఏనుగు తొండంతో దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు.
108 సిబ్బంది బాధితులను పుత్తూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సుబ్రహ్మణ్యం పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యులు రుయాస్పత్రికి రెఫర్ చేశారు.
నెలరోజులుగా పుత్తూరు, వడమాలపేట పరిసరప్రాంతాల్లో ఏనుగులు పంటలను ధ్వంసం చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. ఈ నేపథ్యంలో గజరాజుల దాడులు పెరగడంతో, అటవీశాఖ అధికారులు సమస్య పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు.