Publish Date: Sat, 17 Oct 2020 (13:01 IST)
Updated Date: Sat, 17 Oct 2020 (13:03 IST)
శరన్నవరాత్రుల ప్రారంభోత్సవం సందర్భంగా తొలి రోజు నిజ ఆశ్వయుజ శుద్ధ పాడ్యమి శనివారం నాడు ఇంద్రకీలాద్రిపై కొలువైన జగన్మాత కనకదుర్గమ్మ భక్తులకు స్వర్ణకవచాలంకృత శ్రీ దుర్గాదేవిగా దర్శనమిచ్చారు.
అష్ట భుజాలతో సింహాసనం మీద త్రిశూలధారియై.. కనకపు ధగధగలతో మెరిసిపోయే ఆ తల్లిని దర్శించుకోవడం నిజంగా భక్తులకు కనుల పండగే. ఈ అలంకారంలో అమ్మవారిని దర్శించుకుంటే సకల దరిద్రాలూ తొలగిపోతాయంటారు. స్వర్ణకవచాలంకృత కనకదుర్గాదేవి అలంకారంలో దర్శనం ఇచ్చే రోజున అమ్మవారికి ప్రసాదంగా చక్రపొంగలి, కట్టెపొంగలిని నివేదించారు.
ఏర్పాట్లు బాగున్నాయి: శాసనసభ్యులు మల్లాది విష్ణు
శరన్నవరాత్రి ఉత్సవాలకు అన్ని శాఖల సమన్వయంతో చేసిన ఏర్పాట్లు బాగున్నాయని శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. శనివారం ఉదయం అమ్మవారిని దర్శించుకున్న అనంతరం శాసనసభ్యులు మల్లాది విష్ణు ఇంద్రకీలాద్రిపై ఏర్పాటుచేసిన మీడియా సెంటర్ నుండి మాట్లాడుతూ భక్తులకు ఎటువంటి లోటుపాట్లు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశారన్నారు.
కోవిడ్ వైరస్ ను దృష్టిలో పెట్టుకుని రోజుకు పది వేల మంది అమ్మవారిని దర్శించుకునేలా ఏర్పాటు చేశారన్నారు.తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నిర్వహిస్తున్న రెండవ శరన్నవరాత్రి ఉత్సవాలు అని శాసనసభ్యులు తెలిపారు. భక్తులు ఆన్లైన్ లోనే తప్పక నమోదు చేసుకొని అమ్మవారి దర్శనానికి రావాల్సి ఉంటుందని శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు.