Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

డయల్ -100 ఫోన్ కాల్ కు స్పందన.. రైలులో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు వైద్య సేవలు

డయల్ -100 ఫోన్ కాల్ కు స్పందన.. రైలులో పురిటి నొప్పులతో బాధపడుతున్న మహిళకు వైద్య సేవలు
, సోమవారం, 9 డిశెంబరు 2019 (20:49 IST)
రైలులో ప్రయాణిస్తున్న ఓ గర్భిణీ పురిటి నొప్పులతో బాధపడుతోంది. అది గమనించిన సాటి ప్రయాణీకురాలు డయల్ - 100 కు సమాచారం చేర వేశారు. పది నిముషాల్లో అంబులెన్స్ వాహనం, డాక్టర్ తో పాటు పోలీసులు రైల్వే స్టేషన్లో సిద్ధంగా ఉన్నారు.

ఆ గర్భిణీని అంబులెన్స్ వాహనంలోకి తీసుకొచ్చి ప్రాథమిక వైద్య సేవలు చేయించారు. అనంతరం ... ఓ ప్రయివేట్ క్లినిక్ లో చేర్పించి గైనకాలజిస్ట్ దగ్గర వైద్య సేవలు అందిస్తున్నారు. వివరాలు...
 
కర్నూలు నగరం లక్ష్మీనగర్ కు చెందిన వరలక్ష్మికి కడప పట్టణం కుమ్మరపేటకు చెందిన నాగరాజుతో వివాహమయ్యింది. ఈమె ప్రస్తుతం నవ మాసాల గర్భిణీ. ఈరోజు ఉదయం కడప నుండీ కర్నూలుకు తన భర్త సహా సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలులో బయలు దేరింది. తాడిపత్రికి రాక మునుపే ఆమెకు పురిటి నొప్పులు ప్రారంభం కావడం... ఆ నొప్పులతో విలవిలలాడుతోంది.

ఇది గమనించిన సాటి ప్రయాణీకురాలు ఉదయం 9:10 గంటలకు డయల్ - 100 కు సమాచారం వేశారు. ఆ రైలు తాడిపత్రి రైల్వే స్టేషన్ కు ఉదయం 9:25 గంటలకు చేరింది. అంతలోపే తాడిపత్రి డీఎస్పీ ఏ.శ్రీనివాసులు ఆదేశాలు మేరకు పట్టణ సి.ఐ తేజోమూర్తి, ఎస్ ఐ లు అంబులెన్స్ వాహనం, డాక్టర్ సహా సిద్ధంగా ఉన్నారు. పురిటి నొప్పులతో బాధపడుతున్న ఆమెను అంబులెన్స్ వాహనంలోకి తీసుకొచ్చి ప్రథమ చికిత్సలో భాగంగా వైద్య సేవలు అందించారు.

అనంతరం పట్టణంలోని ఓ ప్రయివేట్ క్లినిక్ కు తీసికెళ్లి జాయిన్ చేయించారు. గైనకాలజిస్ట్ సేవలు అందిస్తున్నారు. డయల్ - 100 కాల్ తో సత్వరమే స్పందించి గర్భిణీ మహిళను ఆదుకున్న పోలీసులను స్థానికులు, సాటి ప్రయాణీకులు అభినందించారు. జిల్లా ఎస్పీ భూసారపు సత్య ఏసుబాబు తాడిపత్రి డీఎస్పీ ఏ.శ్రీనివాసులు, సి.ఐ తేజోమూర్తి బృందాన్ని ప్రశంసించారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

బిసి, ఎస్సి, ఎస్టి, మైనార్టీ, మహిళలకు నామినేటెడ్ పదవులు.. వర్క్ కాంట్రాక్టుల్లో 50 శాతం