Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

జింకలకు దాణా లేదు, నెమళ్ళకు నీరు లేదు: అల్లాడుతున్న వన్యప్రాణులు (Video)

జింకలకు దాణా లేదు, నెమళ్ళకు నీరు లేదు: అల్లాడుతున్న వన్యప్రాణులు (Video)
, శనివారం, 6 మార్చి 2021 (18:29 IST)
దేశమంతటా వన్యప్రాణుల వారోత్సవాలు జరుగుతుంటే తిండి, నీళ్లు లేక తూ.గో. జిల్లా కడియం మండలం జేగురుపాడు జివికె పవర్ ప్రాజెక్ట్ మినీ జూలో జింకలు, నెమళ్ళు వంటివి అల్లాడుతున్నాయి. ఈ ప్రాజెక్ట్ ఏర్పడిన మూడు దశాబ్దాల కాలం నుంచి నిర్వహించబడుతున్న ఈ జూలో ప్రస్తుతం మరణమృదంగం మోగుతుంది. కరోనా వల్ల ఈ జూ లోకి సందర్శకులు రానీయకుండా నిలుపుదల చేసారు.
 
అదే ఈ వన్యప్రాణులకు శాపంగా మారింది. ఖరీదైన రెండు హంసలతో పాటు నెమళ్ళు (తెల్ల నెమలి కూడా), జింకలు, కొండచిలువలుతో పాటు అనేక అరుదైన పక్షులు, జంతువులు ఈ జూలో ఉండేవి. కాల క్రమేణ చాలా వరకూ కనుమరుగయ్యాయి. ఉన్నవాటికి సంరక్షణ లేకుండా పోయింది.
 
ఇటీవల కుక్క కరిచి 28 జింకలు మృతి చెందాయని నిర్వాహకులు చెబుతున్నారు. అవి ఎలా చనిపోయాయని నిర్దారించిన అధికారి ఎవరూ లేరు. ప్రస్తుతం 52 జింకలు ఈ జూలో ఉండగా వాటికి గడ్డి వేసే నాధుడు లేడు. అంతెందుకు ఈ వన్యప్రాణులకు నీరు అందించే విద్యుత్ మోటార్ మరమ్మత్తులకు వచ్చి పదిరోజులైనా బాగు చేసేవారు లేరు. దీంతో నెమళ్ళు ఇతర పక్షులు త్రాగు నీరులేక అల్లాడుతున్నాయి.
 
ఈ జూలో వన్యప్రాణుల పరిస్థితిని జేగురుపాడు సర్పంచ్ యాదల సతీష్ చంద్ర స్టాలిన్, రాజమహేంద్రవరం ఎంపి మార్గాని భరత్ రామ్ దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన ఈ జూను అధికారులతో కలసి పరిశీలించారు. అటవీశాఖ అధికారులు ప్రమేయం లేకుండా ఉండటంపై ఆగ్రహం వ్యక్తం చేసారు. తక్షణమే వీటికి సంరక్షణ చర్యలు చేపట్టాలని ఆదేశించడంతో అధికారులు పరుగులు పెడుతున్నారు. ఇప్పటికైనా ఈ జూకి పూర్వవైభవాన్ని తీసుకురావలని వన్యప్రాణుల ప్రేమికులు కోరుతున్నారు.
 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

వాట్సాప్‌: 24 గంటల తర్వాత మెసేజ్‌లు మాయం, త్వరలో అందుబాటులోకి (video)