Publish Date: Tue, 24 Jan 2023 (14:10 IST)
Updated Date: Tue, 24 Jan 2023 (14:10 IST)
తెలుగుదేశం పార్టీకి చెందిన జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఈ నెల 24వ తేదీన పాదయాత్రను ప్రారంభించనున్నారు. కుప్పం నుంచి ఈ పాదయాత్ర ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో ఈ పాదయాత్రకు చిత్తూరు జిల్లా పోలీసులు అనుమతి ఇచ్చారు.
చిత్తూరు జిల్లా ఎస్పీ రిశాంత్ రెడ్డి ప్రకటన విడుదల చేశారు. అయితే, లోకేశ్ పాదయాత్రలో షరతులతో కూడిన అనుమతులు ఇస్తున్నట్టు ఆయన వెల్లడించారు. పాదయాత్రలో ప్రజలు వాహనదారులు, ఎమర్జెన్సీ సర్వీసెస్ రాకపోకలకు ఎలాంటి ఆటంకాలు కలిగించరాదని సూచించారు.
ప్రభుత్వ, ప్రైవేటు ఆస్తులకు నష్టం కలిగించకూడదని, రహదారులపై సమావేశాలు నిర్వహించకూడదని తెలిపారు. పాదయాత్ర సందర్భంగా బాణాసంచా పేల్చకూడదని, పాదయాత్రలో పాల్గొనేవారు మారణాయుధాలు తీసుకెళ్లరాదని సూచించారు. విధి నిర్వహిణలో ఉన్న పోలీసుల ఆదేశాలను పాటించాలని, శాంతిభద్రతల నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణకు సహకరించాలని కోరారు.
అయితే, పలు షరతులతో కూడిన అనుమతులు తీసుకోవడంపై టీడీపీ నేతలు తర్జనభర్జన చెందుతున్నారు. న్యాయపరమైన సంప్రదింపుల తర్వాత అనుమతి పత్రాలు తీసుకోవాలని భావిస్తున్నారు. కాగా, నారా లోకేశ్ తన పాదయాత్రను ఈ నెల 27వ తేదీన కుప్పం పట్టణంలోని వరదరాజస్వామి ఆలయంలో పూజలు నిర్వహించి ఆ ర్వాత లోకేశ్ పాదయాత్ర ప్రారంభించనున్నారు.