Publish Date: Tue, 13 Jul 2021 (16:07 IST)
Updated Date: Tue, 13 Jul 2021 (16:08 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్. జగన్మోహన్ రెడ్డి బుధవారం తలపెట్టిన పోలవరం ప్రాజెక్టు పర్యటనను రద్దు చేసుకున్నారు. అనుకోని రీతిలో ఈ పర్యటన వాయిదాపడింది. సీఎం పర్యటనకు అన్ని ఏర్పాట్లు జరిగిన నేపథ్యంలో, ఒక్కరోజు ముందుగా ఆయన పర్యటన వాయిదా పడినట్టు ముఖ్యమంత్రి కార్యాలయం వెల్లడించింది. ఈ మేరకు ఓ ప్రకటన చేసింది.
ఈ నెల 14న సీఎం జగన్ పోలవరం పర్యటనకు వెళ్లబోవడంలేదని తెలిపింది. ఈ మేరకు ఉన్నతాధికారులకు సీఎం కార్యాలయం నుంచి సమాచారం అందింది. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో పోలవరం ప్రాజెక్టు పనులను వేగంగా పూర్తిచేయాలని సీఎం జగన్ భావిస్తున్నారు.
అందుకే రేపు పోలవరం సందర్శించి, పనుల పురోగతిపై అధికారులతో సమీక్ష చేపట్టాలని నిర్ణయించుకున్నారు. ఇప్పుడు ఆయన పర్యటన వాయిదా పడిన నేపథ్యంలో, తిరిగి ఎప్పుడు పోలవరం వెళ్లాలనేది తదుపరి నిర్ణయించనున్నారు.
అయితే, జగన్ పర్యటనను రద్దు చేసుకోవడం వెనుక కారణం లేకపోలేదు. తాజాగా ప్రభుత్వం విప ఉదయభాను పోలవరం పర్యటనకు వెళ్లారు. తెలంగాణ రాష్ట్ర సరిహద్దుల్లో నుంచి ఆయనను వెళ్లనీయకుండా ఆ రాష్ట్ర పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఆయన ఏపీ ప్రాంతాల్లోనే పడవలో వెళ్లి పనులను పరిశీలించారు.