Publish Date: Sat, 04 Sep 2021 (20:15 IST)
Updated Date: Sat, 04 Sep 2021 (20:17 IST)
'రాష్ట్రంలో ఆర్థిక నేరగాళ్లు ఎంతోమంది ఉండగా, కేసుల వివరాలు చెప్పడానికి నా పేరు ఎందుకు ఉపయోగించారు?' అంటూ రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ ను టిడిపి నేత చింతమనేని ప్రభాకర్ నిలదీశారు.
అసెంబ్లీలో సిఎం జగన్ చెప్పే కట్టుకథలను డిజిపి బాగా వంటబట్టించుకున్నారని, అక్రమ కేసుల సినిమాలు చూపించడంలో డిజిపి దర్శకుడు రామ్ గోపాల్ వర్మను మించిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
డిజిపికి వైసిపి అంటే అంత వ్యామోహం ఉంటే.. ఆ రుణం మరో రూపంలో తీర్చుకోవాలే తప్ప, తన వంటి వారితో చెలగాటాలు వద్దని, డిజిపి పదవిని కాపాడుకునేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడవద్దని హితువు పలికారు.
మంగళగిరిలోని ఎపి పోలీస్ ప్రధాన కార్యాలయంలో శుక్రవారం రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్ మీడియా సమావేశం నిర్వహించి, ఎవరిదైనా నేర చరిత్ర తెలుసుకోవడం ఎలాగో యాప్ ద్వారా ప్రత్యక్షంగా ప్రదర్శించిన సంగతి తెలిసిందే.
ఈ క్రమంలో ఎంటర్ ప్రైజెస్ సెర్చ్లో టిడిపి నేత చింతమనేని ప్రభాకర్ పేరు టైప్ చేసి ఆయనపై ఉన్న కేసుల వివరాలను మీడియా ప్రతినిధులకు డెమో ఇచ్చారు.