Publish Date: Tue, 31 Oct 2023 (16:25 IST)
Updated Date: Tue, 31 Oct 2023 (16:26 IST)
స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ కేసులో టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడుకు ఏపీ హైకోర్టు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది. దీంతో ఆయన మంగళవారం సాయంత్రం నాలుగు గంటల ప్రాంతంలో రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. 52 రోజుల తర్వాత ఆయన జైలు నుంచి బాహ్య ప్రపంచంలోకి వచ్చారు. ఆయనకు స్వాగతం పలికేందుకు టీడీపీ నేతలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో జైలు వద్దకు చేరుకున్నారు.
మరోవైపు, రాజమండ్రి సెంట్రల్ జైలు వద్ద సెక్షన్ 144 విధించారు. టీడీపీ శ్రేణులు జైలు వద్దకు రాకుండా భారీ భద్రతను ఏర్పాటు చేశారు. అయితే, పోలీసుల హెచ్చరికలను సైతం లెక్క చేయకుండా వేలాది మంది నేతలు, కార్యకర్తలు జైలు వద్దకు చేరుకున్నారు.
ఒక దశలో పోలీసులను, బ్యారికేడ్లను తోసుకుంటూ వారు జైలు వద్దకు చేరుకున్నారు. జైలు వద్ద ఇసుక వేస్తే రాలని పరిస్థితి నెలకొంది. ప్రముఖ సినీ నటుడు బాలకృష్ణ, ఆయన భార్య వసుంధర, లోకేశ్ కుమారుడు దేవాన్ష్ జైలు వద్దకు చేరుకున్నారు. విజయనగరం పర్యటనలో ఉన్న నారా భువనేశ్వరి మరికాసేపట్లో రాజమండ్రికి చేరుకోనున్నారు.