Publish Date: Mon, 09 May 2022 (14:19 IST)
Updated Date: Mon, 09 May 2022 (14:39 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మరో రెండేళ్లలో అసెంబ్లీ ఎన్నికలు జరుగన్నాయి. ఈ ఎన్నికల కోసం అన్ని పార్టీలు ఇప్పటి నుంచే వ్యూహాలు, ప్రతివ్యూహాల్లో నిమగ్నమైవున్నాయి. ముఖ్యంగా, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్లు ముమ్మరంగా రాష్ట్ర పర్యటనలు చేస్తున్నారు.
ఇందులోభాగంగా, చంద్రబాబు ఇటీవల విశాఖపట్టణం జిల్లా భీమిలిలో పర్యటించారు. ఆ సమయంలో ఆయన వైకాపాపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. ఈ పర్యటనలో ప్రజలంతా జై బాబు అంటూ నినాదాలు చేశారు. కానీ ఏపీ సీఎం జగన్ మీడియా మాత్రం ఆ వీడియోలను మార్ఫింగ్ చేసి జై జగన్ అంటూ వీడియో క్లిప్పింగ్స్ సృష్టించి వాటిని సోషల్ మీడియాలో పోస్ట చేస్తున్నారని బాబు చెప్పారు.
అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని ఆయన కోరారు. 2024లో జరిగే ఎన్నికల్లో వైకాపా ఓడిపోతే ఇకపై ఏపీలో వైకాపా ఉండదని ఆయన జోస్యం చెప్పారు. జగన్ సింహం కాదు పిల్లి అని, కేసుల భయంతో అందరి కాళ్లు పట్టుకున్నారన్నారు. అలాగే, ఈ ప్రజా వ్యతిరేక ప్రభుత్వాన్ని ఓడించేందుకు ప్రతి ఒక్కరూ ఏకం కావాలని ఆయన పిలుపునిచ్చారు.