Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో 36 గంటల పాటు చంద్రబాబు నిరసన దీక్ష

ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు పేరుతో 36 గంటల పాటు చంద్రబాబు నిరసన దీక్ష
, బుధవారం, 20 అక్టోబరు 2021 (21:22 IST)
తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యాలయం, జిల్లా కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై వైకాపా మూక దాడికి వ్యతిరేకంగా పార్టీ జాతీయ అధ్యక్షులు, ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు నిరసన దీక్ష చేపట్టనున్నట్లు ఆ పార్టీ నాయకులు తెలిపారు.
 
 “ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరు” పేరుతో 21-10-2021  గురువారం ఉదయం 8 గంటల నుంచి 22-10-2021 శుక్రవారం సాయంత్రం 8 గంటల వరకు 36 గంటల పాటు చంద్రబాబునాయుడు కేంద్ర పార్టీ కార్యాలయం వద్ద  నిరసన దీక్ష కార్యక్రమం చేపట్టనున్నారు.
 
ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడుతూ.. రాష్ట్రంలో ప్రభుత్వ ఉగ్రవాదం పేట్రేగిపోతోంది. ఫ్యాక్షనిజానికి అధికారం తోడయ్యింది. దీనిలో పోలీసులు అంతర్భాగమయ్యారు. ప్రజాస్వామ్యం నశించింది. ప్రశ్నించిన వారిని భౌతికంగా అంతమొందించే ఉన్మాద, మూక దాడులకు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తెరతీశారు. 
 
ఇది కచ్చితంగా ప్రభుత్వ ప్రేరేపిత టెర్రరిజం. ప్రతిపక్ష పార్టీ కేంద్ర కార్యాలయంపై మూక దాడి చేయడం రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ లేదు. అక్కడున్న టీడీపీ నేతలు, సిబ్బందిపై భౌతిక దాడులకు పాల్పడ్డారు. కార్యాలయాన్ని ధ్వంసం చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ముందస్తు కుట్రతో పార్టీ కార్యాలయాలు, టీడీపీ నేతల ఇళ్లపై దాడి చేశారు. 
 
కుటుంబ సభ్యులు ప్రాణభయంతో వణికి పోయేలా దాడులకు తెగబడ్డారు. నిన్నటి రోజు ప్రజాస్వామ్యానికి చీకటి రోజు. ముఖ్యమంత్రి, డీజీపీ ప్రోద్బలంతోనే ప్రతిపక్ష పార్టీ నేతలపై భౌతిక దాడులు, పార్టీ కార్యాలయాల విధ్వంసానికి పాల్పడ్డారు. 
 
ప్రజాసమస్యల పరిష్కారం కోసం తెలుగుదేశం పార్టీ అలుపెరగని పోరాటం చేస్తోంది. దీనిని జీర్ణించుకోలేని వైసీపీ ప్రభుత్వం దమనకాండను మొదటినుంచీ కొనసాగిస్తోంది. దీనిని నిలువరించాల్సిన బాధ్యత ప్రతి రాష్ట్రంలోని ప్రతి పౌరునిపై ఉంది. ప్రభుత్వ ఉగ్రవాదంపై పోరుకు ప్రజలు, ఇతర ప్రతిపక్షాలు, ప్రజాస్వామ్యవాదులు, పౌర సంఘాలు కలిసి ముందుకు రావాలని విజ్ఞప్తి చేస్తున్నా అంటూ తెలిపారు.

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

యూపీలో రాత్రి కర్ఫ్యూ ఎత్తివేత.. యోగి ఆదేశాలు