పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీ ఘన విజయం సాధించింది. ఈ ఎన్నికల్లో పోటీ చేసిన వైకాపా అభ్యర్థికి ధరావత్తు కూడా రాలేదు. ఈ గెలుపు టీడీపీ శ్రేణుల్లో నూతనోత్సాహాన్ని నింపింది. దీనిపై టీడీపీ నేత బీటెక్ రవి మాట్లాడుతూ, ఇది ప్రజాస్వామ్య విజయం. వైకాపా నుంచి కూడా మాకు ఓట్లు వచ్చాయి. అహంకారంతో ఉన్న జగన్మోహన్ రెడ్డిని ఆకాశం నుంచి కిందికి దించాలనే లక్ష్యంతో వైకాపా శ్రేణులు కూడా మాకు సహకరించాయన్నారు. వైకాపా కార్యకర్తలు తనకు ఫోన్ చేసి చెప్పిన మాటలు చెబితే జగన్ ఉరేసుకుంటారు అని బీటెక్ రవి అన్నారు.
గతంలో పులివెందులలో ధైర్యంగా ఓటు వేసే పరిస్థితులు ఉండేవి కాదన్నారు. తాము ప్రజలకు ఆ భరోసాను కల్పించామన్నారు. గతంలో ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు రానీయకుండా అడ్డుకునేవారన్నారు. ఇపుడు ప్రజలు స్వేచ్ఛాయుత వాతావరణంలో వచ్చి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని తెలిపారు. అందకే ఈ రోజు ఈ అద్భుత ఫలితాలు వచ్చాయని బీటెక్ రవి అన్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగితే టీడీపీకి ఓట్లు వేస్తారనేందుకు ఈ గెలుపు ఓ నిదర్శనమన్నారు.
వైఎస్ కంచుకోటలో తెలుగుదేశం జెండా రెపరెపలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం నమోదైంది. వైఎస్ కుటుంబానికి కంచుకోటగా ఉన్న పులివెందులలో తెలుగుదేశం పార్టీ జెండా రెపరెపలాడింది. పులివెందుల జడ్పీటీసీ స్థానానికి జరిగిన ఉప ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి ఘన విజయం సాధించారు. వైకాపా అధినేత, ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అడ్డాలో టీడీపీ అందరి అంచనాలను మించిపోయింది. ఈ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థి మారెడ్డి లతారెడ్డి (బీటెక్ రవి భార్య) 6,050 ఓట్ల మెజార్టీతో జయకేతనం ఎగురవేశారు. వైకాపా అభ్యర్థి హేమంత్ రెడ్డి మాత్రం డిపాజిట్ కూడా దక్కించుకోలేకపోయారు.
పులివెందుల ఉప ఎన్నికల్లో మొత్తం 8,103 ఓట్లు పోలయ్యాయి. ఇందులో మారెడ్డి లతారెడ్డికి 6,735 ఓట్లు పోలుకాగా, వైకాపా అభ్యర్థి హేమంత్ రెడ్డిక కేవలం 685 ఓట్లు మాత్రమే వచ్చాయి. వైకాపా, టీడీపీ అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు జరుగుతుందని ప్రతి ఒక్కరూ భావించారు. కానీ హేమంత్ రెడ్డి ఏమాత్రం కనీస పోటీ కూడా ఇవ్వలేక చివరకు ధరావత్తును కూడా కోల్పోయారు. జగన్ గడ్డపై టీడీపీ ఘన విజయం సాధించడంతో కూటమి శ్రేణుల్లో ఉత్సాహం నెలకొంది. ఘోర పరాభవంతో వైకాపా శ్రేణులు డీలాపడ్డాయి.