పొద్దస్తమానం ఓటు చోరీ జరిగిందంటూ ఊకదంపుడు ప్రచారం చేయొద్దని, దానికి సంబంధించి ఆధారాలు సమర్పించాలని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీకి కేంద్ర ఎన్నికల సంఘం సూచన చేసింది. దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయంటూ రాహుల్ సహా విపక్ష పార్టీలు చేస్తున్న ప్రచారంపై కేంద్ర ఎన్నికల సంఘం మరోసారి తీవ్రంగా స్పందించింది. ఈ క్రమంలో 'ఓటు చోరీ' అనే పదాన్ని పదే పదే వినియోగించడాన్ని తప్పుపట్టిన ఈసీ.. తప్పుడు కథనాలకు కారణమయ్యే 'అసభ్యకర పదాలు' ప్రచారం చేసే బదులు ఆధారాలు చూపించాలని పేర్కొంది.
'ఒక వ్యక్తి-ఒకే ఓటు'కు సంబంధించిన నిబంధన తొలి ఎన్నికలు జరిగిన 1951-52 నాటి నుంచి అమల్లో ఉంది. ఏ ఎన్నికల్లోనైనా ఎవరైనా రెండుసార్లు ఓటు వేసినట్లు ఆధారాలు ఉంటే లిఖితపూర్వక అఫిడవిట్ ఎన్నికల సంఘానికి ఇవ్వండి. ఎటువంటి ఆధారాలు లేకుండా దేశంలోని ఓటర్లందర్నీ 'చోర్'గా పిలవడం సరికాదు' అని ఎన్నికల సంఘం పేర్కొంది. ఇటువంటి చెడు పదబంధాలు ప్రచారం చేయడం కోట్లాది మంది ఓటర్లు, లక్షలాది మంది ఎన్నికల సిబ్బందిపై దాడిగా అభివర్ణించింది.
ఓటర్ల జాబితాలో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ.. కర్ణాటకలోని ఒక్క మహాదేవపుర నియోజకవర్గంలోనే లక్ష ఓట్లు చోరీకి గురయ్యాయని ఇటీవల ఆరోపించారు. బెంగళూరు సెంట్రల్ లోక్సభ పరిధిలో ఉన్న ఈ అసెంబ్లీ స్థానంలో ఓడిపోవడం వల్లే కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి అక్కడ ఓటమి పాలయ్యారని అన్నారు. వీటిపై స్పందించిన ఎన్నికల సంఘం.. ఆరోపణలకు లిఖితపూర్వంగా డిక్లరేషన్ ఇవ్వాలని కోరిన విషయం తెలిసిందే.