Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ఏపీలో మహిళలకు ఉచిత ప్రయాణం.. అయితే, ఓ కండిషన్.. ఏంటది?

Advertiesment
APSRTC

ఠాగూర్

, గురువారం, 31 జులై 2025 (09:58 IST)
ఏపీలో ఆగస్టు 15వ తేదీ నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం సౌకర్యం అందుబాటులోకి రానుంది. అయితే, దీనికి ఏపీ ప్రభుత్వం ఓ నిబంధన విధించింది. ఈ ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళలు విధిగా ఆధార్ కార్డును తమ వెంట తెచ్చుకోవాలని సూచించారు. ఈ మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు వెల్లడించారు. ఈ చరిత్రాత్మక నిర్ణయం లక్షలాది మంది మహిళల జీవితాల్లో పెను మార్పు తీసుకురానుంది. 
 
జోన్-3 పరిధిలోని గుంటూరు, ప్రకాశం, బాపట్ల, పల్నాడు, నెల్లూరు జిల్లాల అధికారులతో జరిగిన సమీక్షా సమావేశంలో ఈ పథకం వివరాలను ఎండీ తిరుమలరావు, ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ, జోనల్ చైర్మన్ సురేశ్ రెడ్డి చర్చించారు. "రాష్ట్రంలో మహిళలు ఎక్కడి నుంచి ఎక్కడికైనా ఆర్టీసీ బస్సుల్లో ఉచితంగా ప్రయాణించవచ్చు. ఆధార్ కార్డు వంటి గుర్తింపు కార్డు చూపించడం తప్పనిసరి" అని ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమల రావు వెల్లడించారు. 
 
పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, ఎక్స్‌ప్రెస్, సిటీ ఆర్డినరీ, మెట్రో ఎక్స్‌ప్రెస్ బస్సుల్లో ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అంతేకాకుండా త్వరలో 1,050 కొత్త బస్సులు ఆర్టీసీకి రానున్నాయి. డీజిల్ బస్సుల స్థానంలో క్రమంగా ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడతామని, విజయవాడ, వైజాగ్‌లో తదుపరి సమీక్షా సమావేశాలు జరుగుతాయని ఎండీ వెల్లడించారు.
 
ఆర్టీసీ చైర్మన్ కొనకళ్ల నారాయణ మాట్లాడుతూ "కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చే దిశగా అడుగులు వేస్తోంది. ఈ పథకం రాష్ట్ర మహిళలకు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ప్రస్తుత బస్సులు, సిబ్బందితోనే ఈ పథకాన్ని సమర్థవంతంగా అమలు చేస్తాం" అని హామీ ఇచ్చారు. త్వరలో విడుదల కానున్న మార్గదర్శకాలతో ఈ పథకంపై మరింత స్పష్టత రానుంది. ఈ నిర్ణయం మహిళలకు ఆర్థిక భారాన్ని తగ్గించడమే కాకుండా వారి ప్రయాణ స్వేచ్ఛను మరింత పెంచుతుంది. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

'హనీమూన్ ఇన్ షిల్లాంగ్' పేరుతో మేఘాలయ హనీమూన్ హత్య కేసు