Publish Date: Wed, 27 Oct 2021 (11:46 IST)
Updated Date: Wed, 27 Oct 2021 (11:49 IST)
ఏపీలోని దేవాలయాలను ఒక గాడిలోకి తేవాలని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం భావిస్తోంది. దీనికి సంబంధించి దేవాదాయశాఖతో ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమై తీసుకున్న నిర్ణయాలను ఒక్కొక్కటీ అమలు చేసేందుకు ఆ శాఖ అధికారులు సిద్ధం అవుతున్నారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్ రెడీ చేశారు.
ఆంధ్ర రాష్ట్రంలోని దేవాదాయశాఖకు చెందిన 87 ముఖ్యమైన ఆలయాల అభివృద్ధికి మాస్టర్ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. జాయింట్ కమిషనర్ క్యాడర్ ఉన్న సింహాచలం, అన్నవరం, దుర్గగుడి, శ్రీశైలం, శ్రీకాళహస్తి, కాణిపాకం, ద్వారకా తిరుమల, పెనుగంచిప్రోలు ఆలయాలతోపాటు, 3 డిప్యుటీ కమిషనర్ క్యాడర్ ఉన్నవి, 35 సహాయ కమిషనర్ క్యాడర్ ఉన్నవి, 41 ఇతర ముఖ్య ఆలయాలకు మాస్టర్ప్లాన్ తయారు చేయనున్నారు.
తిరుమల తిరుపతి దేవస్థానంలో అమలవుతున్నమాస్టర్ ప్లాన్ను అధ్యయనం చేసి, దేవాదాయ శాఖ ఆలయాలకూ అటువంటిదే రూపొందించాలని గత నెలలో సీఎం ఆదేశించడంతో.. అధికారులు దీనిపై దృష్టి పెట్టారు. గర్భాలయం, ముఖద్వారం, నివేదనశాల వంటి వాటిలో అవసరమైన పునర్ నిర్మాణాలకు ప్రతిపాదించనున్నారు. భక్తులకు వసతులు, క్యూకాంప్లెక్స్, వాహనాల పార్కింగ్ తదితరాలన్నీ ఇరవై, పాతిక ఏళ్లపాటు భవిష్యత్ అవసరాలకు సరిపడేలా చూడనున్నారు.