Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

సుస్థిర అభివృద్ధి దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు: మంత్రి మేకపాటి

సుస్థిర అభివృద్ధి దిశగా ఏపీ ప్రభుత్వం అడుగులు: మంత్రి మేకపాటి
, గురువారం, 12 ఆగస్టు 2021 (10:08 IST)
ప్రజల కోసం ప్రభుత్వం తీసుకొచ్చిన ఒక పాలసీ క్షేత్రస్థాయిలోకి ఏ స్థాయికి ఎలా వెళుతుందో, ఎలా అమలు జరుగుతుందో, దాన్ని ప్రభావాలను అంచనా వేయలన్న ఆలోచనల నుంచి పుట్టిందే గవర్నెన్స్ ల్యాబ్‌లు అని, ప్రభుత్వం నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరడంలో గవర్నెన్స్ ల్యాబ్‌లు  మైలురాళ్ళుగా మారుతాయ‌ని ఏపీ ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి మేక‌పాటి గౌత‌మ్ రెడ్డి అన్నారు.

"వేగవంతమైన వృద్ధిలో ఎదుర్కొంటున్న సవాళ్లు, అవకాశాలు" అనే అంశంపై కాన్ఫరెన్స్ ఆన్ ఇండియా @75 సమావేశంలో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వ‌ర్చువ‌ల్‌గా పాల్గొని మాట్లాడారు. "చాలా రాష్ట్రాల్లో పరిశ్రమలకు ఇస్తోన్న ప్రోత్సాహక విధానాలు, పద్ధతులు సరిగ్గా లేవు, ఈ విషయాన్ని ఇప్పటికే కేంద్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లాం.

ప్రోత్సాహకాల విషయంలో ఒక పద్ధతి, బడ్జెట్ ఉండాలి. ప్రోత్సాహాల విషయంలో కొన్ని సంస్కరణలు తీసుకువస్తే చాలా రాష్ట్రాలు ఊపిరి పీల్చుకుంటాయి. క్రమశిక్షణ లేని ప్రోత్సాహకాలే కాదు ఏదీ మంచిది కాదనేది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అభిప్రాయం. మారే పరిస్థితులకు తగ్గట్లు ఎప్పటికప్పుడు మన ఆలోచనలను సరిదిద్దుకోవడమే అసలైన సంస్కరణ. చైనాకు ప్రత్యామ్నాయం భారతదేశం మాత్రమే.

పర్యావరణ హిత పరిశ్రమల స్థాపన, ఉపాధి అవకాశాలిచ్చే పెట్టుబడుల ఆకర్షణే లక్ష్యం. కరోనా సమయంలో పరిశ్రమలు ప్రభుత్వానికి అందించిన తోడ్పాటు మరవలేనిది. మెడికల్ ఆక్సిజన్, బెడ్స్ వంటి సహా అనేక అంశాలలో సహకరించినందుకు కృతజ్ఞతలు. కోవిడ్ 19 ప్రతి మనిషి మీద అనేక రకాలుగా ప్రభావం చూపింది. భౌగోళిక, భౌతిక, వాతావరణ మార్పులకు కరోనా మేల్కొలుపు.

అభివృద్ధి సంబంధిత శాఖలను  ఒకే గొడుగు కిందకి తీసుకురావడంలో ప్రభుత్వం విశేష కృషిషి చేస్తోంది. సంక్షేమం, సమాన అవకాశాలు, విలువైన విద్య, వైద్యం, విజ్ఞాన, పారిశ్రామిక వంటి అనేక రంగాలలో సంస్కరణలు తీసుకువచ్చింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సరికొత్త మార్పులకు తగ్గట్లుగానే సరికొత్త విధానాలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుడుతోంది.

ఎన్నో విపత్తులు, కష్టాలు, భౌగోళిక సవాళ్లను ఎదుర్కోవడం ఆషామాషీ కాదు. ప్రభుత్వం మారవచ్చు. ప్రజా ప్రతినిధులు మారవచ్చు, పాలన మారవచ్చు, అధికారులు, వాతావరణం అన్నీ మారొచ్చు. అభివృద్ధి దిశగా చేసే ప్రణాళిక మాత్రం చెక్కు చెదరకూడదు. నిజానికి విధి, విధానాలను రూపొందించడం, ప్రజల ఆకాంక్షలను నెరవేర్చడానికి ప్రభుత్వానికి 5 ఏళ్ళ సమయం చాలదు. గమనించేంతటి అభివృద్ధి సాధించే పాలన అందించేందుకు 5 ఏళ్ల కాలం సరిపోదు.

రాబోయే  10, 15 ఏళ్ళ కాలంలోనూ అభివృద్ధి ప్రణాళిక మారని విధంగా నిర్ణయాలు, సంస్కరణలు. చైనాకు భారత్ కు తేడా ఒక్కటే..అక్కడ ప్రభుత్వాలు, అధికారులు, పార్టీలు శాశ్వతం కాదు. అభివద్ధి మాత్రమే శాశ్వతం. అలా సుస్థిర అభివృద్ధి దిశగా రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. 1980ల కాలంలోనే తయారీ రంగంలో అగ్రస్థానంలో ఉండాలని చైనా ఒక స్పష్టమైన లక్ష్యం నిర్దేశించుకుంది. అనుకున్నట్లే ఇపుడు మిగతా దేశాలన్నింటిలో ముందుంది.

ప్రపంచీకరణ, విదేశాలలో చదువుకునే అవకాశాలు రావడంతో మన చుట్టూ ఏం జరుగుతుందో, ఎలా ఎదగాలో తెలుసుకునే అవకాశాలు, విశాల ఆలోచనలు  పుష్కలంగా ఉన్నాయి. ఉపాధి, అవకాశాలను పెంపొందించడంతో పాటు అంతిమంగా పేదరికాన్ని తరిమికొట్టడమే లక్ష్యం కావాలి. చేయి చేయి కలిస్తేనే చప్పట్లు అన్న సిద్ధాంతాన్ని వ్యక్తిగతంగా బలంగా నమ్మే వ్యక్తిని నేను. ఒకరు చెబితే మరొకరు వినాలి. ఒకరినొకరు సహకరించుకోవాలి. ప్రోత్సహించుకోవాలి.

అన్న విధంగా  ప్రభుత్వాలు అడుగులు వేయాలి. వాణిజ్య విలువలున్న పాలన అందించాలి. పాలననే వ్యాపారం చేయకూడదు. మా ప్రభుత్వం భవిష్యత్తును అర్థం చేసుకుంటూ అవగాహన పెంచుకుంటూ ఆకాశమంత ఎదిగే విశాల ఆలోచనలు, వినూత్న విధానాలకు శ్రీకారం చుడుతోంది. ప్రాథమిక స్థాయి విద్య నుంచే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం  అనేక కీలక సంస్కరణలకు పెద్దపీట.

చిన్నారులకు గ్రామీణ స్థాయి పాఠశాలల్లోనూ అవసరమైన సకల సదుపాయాలకు ప్రాధాన్యత. అదృష్టం వల్ల నేను బోర్డింగ్ స్కూళ్లలో, విదేశాల్లో చదివినా..ప్రభుత్వ పాఠశాలలు ఎలా ఉంటాయో, అక్కడ సదుపాయాలను ఎప్పుడూ ఆ పాఠశాలల్లోనే చదువుకున్న మా నాన్న ఎప్పుడూ చెబుతుండడం వల్ల వాటిపై పూర్తి అవగాహన ఉంది. ప్రభుత్వ పాఠశాలలకు గత వైభవం , గతం కన్నా ఘనం అనే స్థాయిని తీసుకువస్తాం.

నైపుణ్యం, శిక్షణపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ. ప్రభుత్వ పాఠశాలల్లో పరిశీలిస్తే బాగా చదివే వారు 5 శాతం, నైపుణ్యం లేని వాళ్లు అధికం. పాఠశాలల ఉపాధ్యాయులు కూడా ఈ 5 శాతం మీదే ప్రత్యేక శ్రద్ధ పెట్టి విద్య నేర్పడం బాధాకరం. కానీ ఆ పరిస్థితులను పూర్తిగా మారుస్తాం, అలాంటి విధానలకు ముగింపు పలుకుతాం. 100 శాతం విద్యార్థులకు నైపుణ్యం, విద్య, శిక్షణ అందే మార్గాలను అలవరుస్తాం.

ప్రస్తుతం పాఠశాలల్లో విద్యనేర్పే ఉపాధ్యాయులకు కూడా నైపుణ్యం, నేర్పే లక్షణం, నేర్చుకునే సామర్థ్యం  కావలసినంత లేవు. వారికి కూడా మంచి శిక్షణ అందిస్తాం. నైపుణ్యంలో కూడా సంస్కరణలు చేపడతాం. పిల్లలకు పౌష్ఠికాహారం కూడా చాలా ప్రాముఖ్యమైనది. మంచి భోజనం లేకపోతే మంచి ఆరోగ్యం, మంచి ఆలోచనలు, ఉత్సాహం ఉండవని ముందుగానే గ్రహించి ముఖ్యమంత్రి వాటిపై వ్యక్తిగతంగా ఎంతో శ్రద్ధపెట్టి ఆచరణలో చూపిస్తున్నారు.

చదువుకున్న వారికి మన రాష్ట్రంలో కొదవ లేదు. కానీ పరిశ్రమలకు కావలసిన నైపుణ్యం ఉన్న వారి  కొరత చాలా ఉంది.  ఆ పరిస్థితిని ప్రక్షాళన చేస్తాం. ఏపీలో 30 స్కిల్ కాలేజీలు ఏర్పాటు చేసి, స్కిల్ ఇండియా, స్కిల్ ఏపీ మిషన్ ల ద్వారా నైపుణ్య, సాంకేతిక విద్యను మరో స్థాయికి చేర్చే దిశగా ముందడుగు. కోవిడ్ -19 కారణంగా రకరకాల ఆలోచనలున్నా పారిశ్రామిక రంగంలో ఆశించిన సంస్కరణలు చేపట్టలేకపోయాం" అని మంత్రి మేక‌పాటి పేర్కొన్నారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

దేశంలో మళ్లీ ఉధృతి : 24 గంటల్లో 41 వేల పాజిటివ్ కేసులు