Publish Date: Sat, 18 Dec 2021 (11:43 IST)
Updated Date: Sat, 18 Dec 2021 (11:45 IST)
ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పీఆర్సీపై రెండు రోజుల్లో క్లారిటీ రానుంది. సోమవారం ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం చర్చించి ఫిట్మెంట్ ఖరారు చేసే అవకాశాలున్నాయి. ఉద్యోగుల ఇతర డిమాండ్ల పరిష్కారంపైన కూడా సోమవారం సీఎం స్పష్టమైన హామీ ఇవ్వనున్నారు.
శుక్రవారం సీఎం జగన్తో పీఆర్సీ అంశంపై మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ప్రభుత్వ ప్రధాన సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి చర్చించారు. ఉద్యోగులకు ఫిట్మెంట్ సహా ఇతర డిమాండ్ల పరిష్కారంపై రెండు గంటలపాటు చర్చించారు సీఎం. ఉద్యోగులకు ఫిట్మెంట్ ఎంత శాతం ఇవ్వాలి, సీపీఎస్ రద్దు అంశాలపై ప్రధానంగా ఫోకస్ చేశారు ముఖ్యమంత్రి.
ఫిట్మెంట్, ఇతర డిమాండ్ల అమలుతో ప్రభుత్వ ఖజానాపై ఎంతమేర భారం పడుతుందనే వివరాలను అడిగి తెలుసుకున్నారు జగన్. శుక్రవారం కూడా ఉద్యోగ సంఘాల నేతలు సజ్జలతో సమావేశమయ్యారు. తమ డిమాండ్లపై ఆయనతో చర్చించారు. ఉద్యమాన్ని తాత్కాలికంగానే వాయిదా వేశామని చెప్పారు.
వచ్చే బుధవారం మరోసారి సీఎస్తో ఉద్యోగుల వివిధ సమస్యలపై చర్చలు జరుగుతాయన్నారు. సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఉద్యమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశామే తప్ప.. విరమించలేదని ఏపీ ఉద్యోగ సంఘాలు స్పష్టం చేశాయి.