Publish Date: Sat, 04 Dec 2021 (19:05 IST)
Updated Date: Sat, 04 Dec 2021 (19:10 IST)
ఏపీ మాజీ సీఎం చంద్రబాబు నాయుడుపై ఏపీ జలవనరుల శాఖ మంత్రి అనిల్ కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు నాయుడు కనీసం అవగాహన లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టుపై తప్పుడు ప్రచారాలు చేస్తున్నామని మండిపడ్డారు.
అన్నమయ్య ప్రాజెక్టు విషయంలో చంద్రబాబు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని మండిపడ్డారు. శనివారం మంత్రి మీడియాతో మాట్లాడుతూ.. అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోవడంపై విపక్షాలు, కేంద్ర ప్రభుత్వం చేస్తున్న విమర్శలపై ఆయన తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విపత్తు వల్ల జరిగిన ఘటనను.. మానవ తప్పిదం, ప్రభుత్వ వైఫల్యం అని ఎలా అంటారని అనిల్ కుమార్ ప్రశ్నించారు.
డ్యామ్ సెఫ్టి విషయంలో 2017లో కొత్త స్పిల్వే కట్టాలంటే అప్పుడు చంద్రబాబు ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబువి దొంగ ఏడుపులు, చిల్లర రాజకీయాలు అని విమర్శించారు. ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆయనకే తెలియదన్నారు.
అలాగే కేంద్ర మంత్రి షేకావత్ మాటలు చాలా బాధ కలిగించాయని అన్నారు. గంటల వ్యవధిలోనే లక్షల క్యూసెక్కుల వరద నీరు వచ్చిందని, ప్రభుత్వం తరపున చేపట్టాల్సి చర్యలు చేపట్టామన్నారు.