Publish Date: Thu, 10 Feb 2022 (13:59 IST)
Updated Date: Thu, 10 Feb 2022 (14:05 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గురువారం పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షల నిర్వహణా షెడ్యూల్ను విడుదల చేసింది. రాష్ట్ర మంత్రులు ఆదిమూలపు సురేష్, బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డిలు కలిసి ఈ షెడ్యూల్ను మీడియాకు రిలీజ్ చేశారు.
ఆ తర్వాత వారు మీడియాతో మాట్లాడుతూ, పదో తరగతి పరీక్షలను మే నెల 2వ తేదీ నుంచి 13 వరకు ఉదయం 9:30 నుండి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించనున్నట్లు ప్రకటించారు. అలాగే, ఇంటర్మీడియట్ పరీక్షలు ఏప్రిల్ 8 నుంచి 28 వరకు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తున్నట్టు చెప్పారు.
అయితే, ఇంటర్మీడియట్ విద్యార్థులకు మార్చి 11 నుంచి 31వ తేదీ వరకు ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహిస్తామని.. విద్యార్థుల మంచి భవిష్యత్తు కోసం పరీక్షలు నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉందని మంత్రి ఆదిమూలపు సురేష్ అన్నారు. కోవిడ్-19 నిబంధనలను అనుసరించి పరీక్షలు జరిగేలా చర్యలు జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు.