Publish Date: Thu, 10 Feb 2022 (13:54 IST)
Updated Date: Thu, 10 Feb 2022 (13:56 IST)
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) పార్టీ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. తెలుగు రాష్ట్రాల విభజన ప్రజల అభిప్రాయల మేరకు జరగలేదంటూ ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవల రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై లోక్సభలో వ్యాఖ్యానించారు.
ఈ వ్యాఖ్యలను తీవ్రంగా పరిగణించిన తెరాస పార్టీ నేతలు ఆయనకు వ్యతిరేకంగా సభా హక్కుల ఉల్లంఘన నోటీసులను జారీచేశారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ కార్యాలయంలో రూల్ 187 కింద ఈ నోటీసులను తెరాస ఎంపీలు అందజేశారు.
ఏపీ విభజన బిల్లు, తెలంగాణ ఏర్పాటుపై ప్రధాని నరేంద్ర మోడీ అభ్యంతరకంగా మాట్లాడారాని అందులో పేర్కొంది. తలుపులు మూసేసి తెలంగాణ బిల్లును ఆమోదింపజేశారని మాట్లాడటం రాజ్యాంగాన్ని అవమానిచడమేనని చెప్పారు.
ఈ ప్రివిలేజ్ మోషన్ నోటీసులను రాజ్యసభ సెక్రటరీ జనరల్కు తెరాస ఎంపీలు కె.కేశవరావు, సంతోష్ కుమార్, బడుగుల లింగయ్య యాదవ్లు కలిసి అందజేశారు. ఆ తర్వాత రాజ్యసభ సమావేశాలను బహిష్కరిస్తున్నట్టు వారు ప్రకటించారు.