Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia
Advertiesment

శాంతి వచనాలతో మమ్మల్ని సంకనాకించారు : బాబుకు సూటిగా చెప్పిన జేసీ

శాంతి వచనాలతో మమ్మల్ని సంకనాకించారు : బాబుకు సూటిగా చెప్పిన జేసీ
, గురువారం, 19 డిశెంబరు 2019 (10:00 IST)
టీడీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు ఆ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి ఓ సలహా ఇచ్చారు. సార్.. ఇకనైనా మీరు శాంతివచనాలు వల్లించకండి. ఇలా శాంతివచనాలు వల్లించే మమ్మల్ని సంకనాకించారు అంటూ చంద్రబాబు ముందే ఆక్రోశం వెళ్లగక్కారు. పైగా, తప్పట్లకు తాళాలకు మీరు లొంగొద్దు.. అంటూ చంద్రబాబుకు సూటిగా చెప్పారు. 
 
బుధవారం అనంతపురం జిల్లాలో చంద్రబాబు పర్యటించారు. ఈ సందర్భంగా టీడీపీ సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు. ఇందులో జేసీ దివాకర్ రెడ్డి మాట్లాడుతూ, 'బాబు గారూ.. మీరు మా జిల్లాకు వచ్చారు. సంతోషం.. మేం పడుతున్న ఈతిబాధలు చూడ్డానికి వచ్చారు. మాకు ఉపశమనంగా నాలుగు మాటలు చెప్పడానికి వచ్చారు.. మాకు ధైర్యం చెప్పడానికి వచ్చారు. ఇంత తొందరగా మీరు జిల్లాలు పర్యటిస్తారని నేననుకోలేదు. నా ఉద్దేశంలో ఇంకొంతకాలం నిశ్శబ్దంగా మీరు అబ్జర్వ్‌ చేసుంటే బాగుండేది సార్‌..!.
 
జగన్‌ ఎలాంటి వాడో నేను మీకు మనం అధికారం కోల్పోవడానికి రెండేళ్ల ముందే చెప్పాను. మావాడి సంగతి మీకు తెలీదు.. రాజశేఖర్‌కు నాకున్న సంబంధాలను బట్టి.. చిన్నప్పటి నుంచి చూశాను కాబట్టి చెప్పాను. జగన్‌కు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డిలో 10 శాతం మంచి గుణాలు లేవు. ఆయన అచ్చం రాజారెడ్డి గారని చెప్పాను. ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణం చేయకముందే డీజీపీ సెల్యూట్‌ కొట్టడానికి వస్తాడు.. ఎట్లాగైనా బాబును జైల్లో పెడితేనే మీ సెల్యూట్‌ రిసీవ్‌ చేసుకుంటానని చెబుతాడని మీకు చెప్పాను. అలా చేయకపోతే నీవు అన్‌ఫిట్‌ అంటాడని చెప్పాను. కారణం లేకుండా ఎలా లోపల వేసేదని డీజీపీ అంటే.. ఏమీ లేకపోయినా లోపలకు తొయ్యరా నీ' అంటాడని చెప్పాను. 
 
'అధికారంలో ఉన్నప్పుడు శాంతి వచనాలు.. శాంతి వచనాలు.. అంటూ మమ్మల్ని సంకనాకించావు' అని వ్యాఖ్యానించారు. 'కానిస్టేబుళ్లు మా వాళ్ల దగ్గరకు వచ్చి.. కొడకా అక్కడ చేరకుండా నిన్ను గుడ్డలూడదీసి కొడతా.. అంటూ బెదిరించి పార్టీలు మార్పిస్తున్నారు సార్‌. ఎస్పీ కాకుండా మిగతా పోలీసులందరూ వంగివంగి నమస్కారాలు పెడుతూ ఉన్నారు.. నాకూ అవకాశమొస్తే బూట్లు నాకే పోలీసోళ్లను తెచ్చుకుని అదే గంజాయో.. చీప్‌ లిక్కరో జేబులో పెట్టి కేసు పెట్టిస్తా. ప్రభుత్వం అంటే ఏందో నాకు తెలుసు. నేనూ 15 ఏళ్లు మంత్రిగా ఉన్నా. 
 
వాస్తవంగా మన ఎమ్మెల్యేలను మార్చాలని గతంలో చెప్పా. కానీ మీరు కొన్ని కారణాల వల్ల మార్చలేదు. సరే.. ఇప్పుడు చెబుతున్నా.. మన ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలకన్నా వేల రెట్లు మేలు. రెండున్నరేళ్లలో ఎన్నికలొస్తాయి. మిమ్మల్ని అందరూ మోసం చేశారు. ఏనాడైనా మీరు మమ్మల్నిగానీ, అధికారులనుగానీ ఒక్క మాటైనా అన్నారా..? ఒక్కసారైనా గట్టిగా మాట్లాడలేదు. మిమ్మల్ని అందరూ పొగుడుతారు. తప్పట్లకు తాళాలకు దయచేసి లొంగొద్దు సార్‌' అంటూ సభా వేదికపై నుంచే చంద్రబాబుకు జేసీ దివాకర్ రెడ్డి సలహా ఇచ్చారు. 

Share this Story:

Follow Webdunia telugu

తర్వాతి కథనం

డోనాల్డ్ ట్రంప్‌‌కు తేరుకోలేని షాక్.. అభిశంసనకు ఒకే..