Publish Date: Thu, 19 Mar 2020 (15:34 IST)
Updated Date: Thu, 19 Mar 2020 (15:45 IST)
ఆంధ్రప్రదేశ్లో స్థానిక సంస్థల ఎన్నికల ప్రక్రియ మళ్లీ మొదటి నుంచి నిర్వహించాలని అఖిలపక్ష నేతలు డిమాండ్ చేశారు. తెదేపా, కాంగ్రెస్, సీపీఐ, ఆమ్ఆద్మీ, ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ నేతలు గురువారం రాష్ట్ర గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ను కలిసి ఈమేరకు పది పేజీల వినతిపత్రాన్ని అందజేశారు.
అనంతరం తెదేపా రాష్ట్ర అధ్యక్షుడు కళా వెంకట్రావ్ మాట్లాడుతూ... ఏకగ్రీవాలతో సహా అన్నింటినీ రద్దు చేసి రీనోటిఫై చేయాలని గవర్నర్ను కోరినట్లు చెప్పారు. కేంద్ర హోం మంత్రికి ఎస్ఈసీ నుంచి వెళ్లిన లేఖ ఆయన కార్యాలయం నుంచే వెళ్లినట్టు భావిస్తున్నామని తెలిపారు.
ఎస్ఈసీ రమేష్ కుమార్ పేరిట బయటకొచ్చిన లేఖను కేంద్ర ఎన్నికల కమిషన్ పరిగణనలోకి తీసుకోవాలని ఆయనకు భద్రత కల్పించాలని కోరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ.. వైకాపా నేతలు పోలీసుల అండతో ఇతర పార్టీల నేతలను భయాందోళనకు గురిచేశారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియను నిష్పక్షపాతంగా నిర్వహించాలని డిమాండ్ చేశారు.