Publish Date: Tue, 15 Feb 2022 (17:24 IST)
Updated Date: Tue, 15 Feb 2022 (17:26 IST)
మరో రెండు వారాల్లోనే పార్టీ ప్రధాన కార్యాలయం నుంచే కీలక ప్రకటన వస్తుందని ప్రముఖ హాస్య నటుడు అలీ అన్నారు. ఆయన మంగళవారం ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో సమావేశమయ్యారు. ఆ సమయంలో అలీ భార్య కూడా ఉన్నారు. సీఎంతో సమావేశం ముగిసిన తర్వాత అలీ మీడియాతో మాట్లాడారు.
రెండు వారాల్లోనే వైకాపా ఆఫీసు నుంచి కీలక ప్రకటన వస్తుందని చెప్పారు. సీఎంను కేవలం మర్యాదపూర్వకంగానే కలిశానని చెప్పారు. సీఎం జగన్తో భేటీ సందర్భంగా కొంతమంది వైకాపా పెద్దలను కూడా కలవడం జరిగిందన్నారు. కొడాలి నాని, కన్నబాబులతో పాటు పలువురు ఎమ్మెల్యేలను కలిసినట్టు అలీ వివరించారు.
నిజానికి మా పెళ్లి రోజు సందర్భంగా సీఎం జగన్ను కలుద్దామని భావించానని కానీ అది సాధ్యపడలేదన్నారు. ఇపుడు కలిసినట్టు చెప్పారు. ఇకపోతే తనకు రాజ్యసభ సీటును ఇస్తున్నారన్న విషయం తనకంటే ముందుగా మీకే తెలుస్తుందని చమత్కరించి, రాజ్యసభ సీటు అంశాన్ని అలీ దాటవేశారు.