Publish Date: Sat, 17 Jul 2021 (10:49 IST)
Updated Date: Sat, 17 Jul 2021 (10:57 IST)
కరోనా వైరస్ మహమ్మారి కారణంగా రైల్వే శాఖ అనేక రైలు సర్వీసులను తాత్కాలికంగా నిలిపివేసింది. ఇపుడు కరోనా వైరస్ వ్యాప్తి క్రమంగా తగ్గుముఖం పడుతుండటంతో ఈ రైలు సర్వీసులను దశల వారీగా పునరుద్ధరిస్తుంది. ఈ నేపథ్యంలో ఈ నెల 19 నుంచి విడతల వారీగా 82 రైళ్లను అందుబాటులోకి తీసుకొస్తున్నట్టు దక్షిణమధ్య రైల్వే ప్రకటించింది.
అయితే ఇందులో 66 ప్యాసింజర్ రైళ్లే కావడం గమనార్హం. మిగతావి ఎక్స్ప్రెస్ రైళ్లు. ఈ నెల 19 నుంచి కొన్ని, 20, 21 తేదీల్లో మరికొన్ని రైళ్లు అందుబాటులోకి వస్తాయి. ఈ రైళ్లన్నీ గతంలో తిరిగిన మార్గంలోనే కొత్త నంబర్లతో తిరుగుతాయని రైల్వే తెలిపింది.
రైలు ప్రయాణంలో కొవిడ్ నిబంధనలు కఠినంగా అమల్లో ఉంటాయని దక్షిణమధ్య రైల్వే జీఎం గజానన్ మాల్య స్పష్టం చేశారు. ప్రయాణ సమయంలో ప్రతి ఒక్కరు భౌతిక దూరం పాటించాలని, మాస్క్ ధరించాల్సిందేనని అన్నారు.
అందుబాటులోకి రానున్న రైళ్ళలో కొన్నింటిని పరిశీలిస్తే, కాజీపేట-సిర్పూరు టౌన్, వాడి-కాచిగూడ, డోర్నకల్-కాజీపేట, కాచిగూడ-మహబూబ్ నగర్, కాచిగూడ- కరీంనగర్, సికింద్రాబాద్-కళబురిగి, కరీంనగర్-పెద్దపల్లి, విజయవాడ-డోర్నకల్, విజయవాడ-గూడూరు, కాకినాడ పోర్ట్-విజయవాడ, నర్సాపూర్-గుంటూరు, రాజమండ్రి-విజయవాడ, విజయవాడ-మచిలీపట్టణం, రేణిగుంట-గుంతకల్, వరంగల్-సికింద్రాబాద్, గుంటూరు-విజయవాడ తదితర రైళ్లు ఉన్నాయి.