Publish Date: Wed, 25 Nov 2020 (05:58 IST)
Updated Date: Wed, 25 Nov 2020 (06:00 IST)
ప్రభుత్వ పాఠశాలల్లో ప్రశాంత వాతావరణంలో తరగతులు జరుగుతున్నాయని, కోవిడ్ తరువాత విద్యావ్యవస్థ గాడిన పడుతుందని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ అన్నారు. ప్రస్తుతం సగటున 50 శాతం విద్యార్థులు పాఠశాలలకు హాజరవుతున్నారు.
ఈనెల 2 నుంచి ఇప్పటివరకు 9, 10 తరగతులు మాత్రమే పాఠశాలల్లో భోదన జరిగింది. సోమవారం నుంచి 8వ తరగతి విద్యార్థులు కూడా పాఠశాలలకు హాజరవుతున్నారు. మంగళవారం విద్యార్థుల హాజరుకు సంభందించిన వివరాలను విద్యాశాఖ మంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ వెల్లడించారు.
"మంగళవారం 50 శాతం 10వ తరగతి విద్యార్థులు హాజరయ్యారు. 9వ తరగతి విద్యార్థులు 52 శాతం హాజరయ్యారు. 8వ తరగతి విద్యార్థులు 47 శాతం హాజరయ్యారు. పాఠశాలల్లో కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ తరగతులు నిర్వహిస్తున్నాం.
ప్రశాంత వాతావరణంలో తరగతులు జరుగుతున్నాయి. మరోవైపు జగనన్న విద్యాకానుక వారోత్సవాలు కూడా జరుగుతున్నాయి. డిసెంబర్ 14 తరువాత 6, 7 తరగతులు కూడా నిర్వహించడం జరుగుతుంది.
కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటూ పాఠశాలల్లో, కళాశాలల్లో విద్యార్థులకు, ఉపాధ్యాయులకు వైద్య పరీక్షలు చేస్తున్నారు. ప్రతిరోజూ కోవిడ్ పై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేయించటం, శానిటైజేషన్, మాస్క్ లు ధరించేలా జాగ్రత్తలు తీసుకుంటున్నాం. అన్ని జిల్లాల నుంచి ఎప్పటికప్పుడు సమాచారం తెలుసుకుంటూ అధికారులను అప్రమత్తం చేస్తున్నాం.
పాఠశాలల్లో పారిశుధ్య పరిస్థితులను కూడా ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ఆదేశించాం. మాస్క్, శానిటైజేషన్, సామజిక దూరం విషయాల్లో ఖచ్చితమైన జాగ్రత్తలు తీసుకుంటున్నాం" అన్నారు.