Publish Date: Tue, 10 Sep 2019 (20:03 IST)
Updated Date: Tue, 10 Sep 2019 (20:04 IST)
పల్నాడు ప్రాంతం తాజా రాజకీయ ప్రకంపనలతో అట్టుడుకుతోంది. తమ కార్యకర్తలపై వైసీపీ వాళ్లు దాడులకు పాల్పడుతున్నారంటూ టీడీపీ ఛలో ఆత్మకూరు కార్యక్రమం ప్రకటించగా, వైసీపీ కూడా పోటాపోటీగా వ్యవహరిస్తోంది. ఈ పరిస్థితులపై రాష్ట్ర డీజీపీ గౌతమ్ సవాంగ్ స్పందించారు. పల్నాడు ప్రాంతంలో 144 సెక్షన్ అమలులో ఉందని, 30 పోలీస్ యాక్ట్ కూడా విధించామని వెల్లడించారు.
ఊరేగింపులు, ధర్నాలు, ప్రదర్శనలకు అనుమతి లేదని స్పష్టం చేశారు. ప్రజలు వినాయక చవితి, మొహర్రం వంటి పండుగలను ప్రశాంతంగా జరుపుకుంటున్నారని, శాంతిభద్రతలకు విఘాతం కలిగించవద్దని పేర్కొన్నారు.
శాంతిభద్రతలు కాపాడడంలో రాజకీయ పార్టీలు పోలీసులకు సహకరించాలని డీజీపీ కోరారు. పల్నాడు ప్రాంతంలో అవాంఛనీయ ఘటనలు జరిగితే ఎదుర్కొనేందుకు పోలీసులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు.