Publish Date: Wed, 04 Oct 2023 (09:06 IST)
Updated Date: Wed, 04 Oct 2023 (09:07 IST)
ఏపీ ముఖ్యమంత్రి, వైకాపా అధినేత జగన్మోహన్ రెడ్డి గురువారం ఢిల్లీకి వెళుతున్నారు. ఆయన గన్నవరం నుంచి హస్తినకు ప్రత్యేక విమానంలో చేరుకుంటారు. అక్కడ రెండు రోజులు పాటు ఉంటారు. ఈ పర్యటనలో ఆయన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్ షాలతో పలువురు కేంద్ర మంత్రులతో భేటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. అయితే వీరి సమయాన్ని బట్టి గురువారం లేదా శుక్రవారం ఢిల్లీ నుంచి తిరిగిరానున్నారు.
జగనన్న ఇళ్ళ సామూహిక గృహ ప్రవేశాల కార్యక్రమంలో గురువారం సీఎం జగన్ పాల్గొనాల్సివుంది. ఇది ముందుగా నిర్ణయించిన కార్యక్రమం. కానీ దీన్ని హఠాత్తుగా వాయిదా వేసారు. ఆ రోజునే ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్ళనున్న నేపథ్యంలో గృహ ప్రవేశాల కార్యక్రమాన్ని వాయిదా వేస్తున్నట్టు ముఖ్యమంత్రి కార్యాలయ వర్గాలు వెల్లడించాయి.
కాగా, చంద్రబాబు అరెస్టు తర్వాత జగన్ తొలిసారిఢిల్లీకి వెళుతుండటంతో ఆయన పర్యటనపై ఆసక్తి నెలకొంది. నిజానికి జగన్ దంపతులు లండన్ పర్యటన ముగించుకుని రాష్ట్రానికి వచ్చిన తర్వాత నరేంద్ర మోడీ, అమిత్ షాలను కలిసేందుకు ప్రయత్నించారు. కానీ, వారి అపాయింట్మెంట్ ఖరారు కాకపోవడంతో ఆయన ఢిల్లీకి వెళ్లలేక పోయారు.