Publish Date: Wed, 04 Jan 2023 (20:32 IST)
Updated Date: Wed, 04 Jan 2023 (20:33 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పాలిస్తున్న ఈ సైకో సీఎం జగన్ త్వరలోనే ఇంటికి పోవడం ఖాయమని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు జోస్యం చెప్పారు. ఆయన తన సొంత నియోజకవర్గమైన కుప్పంలో మూడు రోజుల పర్యటనకు బుధవారం వచ్చారు. అయితే, చంద్రబాబు రోడ్షోను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో వారిపై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.
14 యేళ్లుగా ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని ఆపుతారా అని ప్రశ్నించారు. ఆ తర్వాత ఆయన పెద్దూరులో పాదయాత్ర ప్రారంభించారు. మరోవైపు ఇంటింటికి తిరిగి కరపత్రాలు పంచాలని, జగన్ నియంతృత్వ ధోరణిని, ప్రభుత్వ వైఫల్యాలను వివరించాలని టీడీపీ నిర్ణయించింది. వచ్చే ఎన్నికల తర్వాత జగన్ ఇంటికి పోవడం ఖాయమని ఆయన చెప్పారు.
అస్సలు సభలు, ర్యాలీలు నిర్వహించకుండా ఏ చట్టం ప్రకారం జీవో1 తెచ్చారని చంద్రబాబు పోలీసులను నిలదీశారు. ఇది ప్రజలు, ప్రజాస్వామ్య గొంతుకను నొక్కడమేనని, ఇలాంటి ఆటలు సాగనివ్వబోమని, తన రోడ్డు షోలపై ఏ చట్టం కింద పోలీసులు అభ్యంతరం చెపుతున్నారని సూటిగా ప్రశ్నించారు. అయితే, పోలీసులు చంద్రబాబు ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వలేకు బిక్కముఖం పెట్టారు.