Publish Date: Sun, 05 Apr 2020 (09:22 IST)
Updated Date: Sun, 05 Apr 2020 (09:23 IST)
ప్రసిద్ధ పుణ్యక్షేత్రం తిరుమలలో సాలకట్ల వసంతోత్సవాలు ఆదివారం నుంచి ప్రారంభంకానున్నాయి. ఈ వేడుకలు ఈ దఫా కేవలం ఆలయ ప్రాంగణంలోని కళ్యాణ మండపంలోనే జరుగనున్నాయి.
నిజానికి ప్రతియేటా చైత్రశుద్ధ త్రయోదశికి మొదలై పౌర్ణమికి ముగిసేలా మూడు రోజులపాటు ఈ ఉత్సవాలు నిర్వహించడం సంప్రదాయం. ఇందులోభాగంగా మూడు రోజుల పాటు మధ్యాహ్న సమయంలో శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామికి ఆలయంలోని కళ్యాణ మండపంలో అభిషేకాలు నిర్వహిస్తారు. సాయంత్రం ఆస్థానం నిర్వహిస్తారు.
తొలి రెండు రోజులు మలయప్పస్వామి, దేవేరులు మాత్రమే వసంతోత్సవంలో పాల్గొంటారు. చివరి రోజున మూడు యుగాలను గుర్త్తుచేస్తూ శ్రీదేవి, భూదేవి సమేత మలయప్పస్వామి, సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్రమూర్తి, రుక్మిణీ సమేత శ్రీకృష్ణస్వామికి ఏకకాలంలో అభిషేకం నిర్వహిస్తారు. దాంతో పవిత్సోత్సవాలు ముగుస్తాయి.
అయితే, ఈ యేడాది కరోనా వైరస్ ప్రభావం కారణంగా వసంతోత్సవాల్లో భాగంగా రెండోరోజు నిర్వహించే రథోత్సవాన్ని కూడా టీటీడీ రద్దు చేసింది. దానికి బదులుగా సర్వభూపాల వాహనంలో ఉత్సవర్లను కొలువుదీర్చి మండపంలోనే విశేష సమర్పణ నిర్వహించేలా నిర్ణయించారు. మొత్తంమీద శ్రీవారి సేవలు, ఉత్సవాలన్నీ భక్తులు లేకుండానే కేవలం ఆలయ అధికారులు, వేదపండితుల సమక్షంలోనే జరుగుతున్నాయి.
ఠాగూర్
Publish Date: Sun, 05 Apr 2020 (09:22 IST)
Updated Date: Sun, 05 Apr 2020 (09:23 IST)