Publish Date: Wed, 09 Jan 2019 (10:34 IST)
Updated Date: Wed, 09 Jan 2019 (10:54 IST)
సకల జగద్వ్యాపినియైన పరాశక్తిని ఆశ్రయించడం కంటే మోక్షాన్ని కాంక్షించే వాడికి మార్గాంతరం లేదు. సదసదాత్మికమైన ఈ సమస్త సృష్టిని ఆ మహామాయయే నిర్వహిస్తూ ఉంటుంది. హరిహర బ్రహ్మలూ, సూర్యచంద్రులూ, అశ్వినులూ, అష్ట వసువులూ, తష్టా, కుబేరుడూ, వరుణుడూ, వహ్ని, వాయివూ, పూషుడూ, స్యౌనీ, వినాయకుడూ.. వీరందరూ శక్తితో కూడిన వారవడం చేత ఆయా కార్యాలను నిర్వహించగలుగుచున్నారు. లేకపోతే వారు కదలనైనా కదలలేరు. ఆ పరమేశ్వరియే ఈ జగత్తుకు కారణం. అందుకే ఆమెను విధి విహితంగా ఆరాధించాలి. దేవీ యజ్ఞం నిర్వహించాలి.
మూడు శక్తులను ముచ్చటగాను విజయవాటికను వికసించ
నాటికి నేటికి ఏనాటికి నువు.. కోటి శుభములను కలిగించ
త్రిశక్తి మయమై.. ముల్లోకాలను పాలించే తల్లీ
ఆదిశక్తివై.. ఆది దేవియై దిగి వచ్చావా మళ్ళీ..
రుక్షనేత్రములు విస్ఫులింగముల భగభగ జ్యాలలు వెదజల్లి
ప్రచండ మయమౌ దివ్య శక్తి యుత తేజః పుంజము పంపించి
ప్రళయకాల సంకల్ప నాట్య పదఘట్టనాళితో ఝళిపించి
రాక్షస కోటిని సంహరించగా.. కాళికవే నీవయినావు..
ఓంకారాన్విత నాదాత్మకమౌ వేద సంహితల రాజిల్లి
రాగాలంకృత లయాత్మ కృతమౌ సంగీతమ్మగ భాసిల్లి
లలిత లలిత మృదు పద శోధలతో సాహిత్యముగ విలసిల్లి
జ్ఞాన పయస్సు జనాళి కీయంగా సరస్వతిని నీవయినావు..
పాలకడలిని మధించగా.. సురాసురులు ఒక కృతిని సేయగ
ఝళం ఝళత్కృత కీటక నాదములు ఒయారాలను ఒలికిస్తూ
సముద్ర మధ్యము నందున నీవు శోబనాంగివై శుభదాయినివై
సంపద్భాగ్యము భక్తుల కీయగ మహాలక్ష్మివై అగుపించావు..