ఓటర్ల జాబితా నుంచి ఓటర్ల కులం పేరును తొలగించవలిసిందిగా ఎలక్షన్ కమిషన్ను ఆదేశించాలని కోరుతూ ఒక ప్రజాప్రయోజన వాజ్యం లేవనెత్తిన పిటిషన్ను సుప్రీం కోర్టు శుక్రవారం తోసిపుచ్చింది. ఓటర్ల జాబితాలో కులం పేరును నమోదు చేయడం వల్ల కుల తత్వ రాజకీయాలు ప్రబలిపోతున్నాయని ఆరోపిస్తూ వేలు గాంధీ అనే గాంధేయవాది సుప్రీం కోర్టులో పిల్ వేశారు.
ఈ పిల్ను పరిశీలించిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కె.జి బాలకృష్ణన్ నేతృత్వంలోని బెంచ్ ఈ విషయంపై తాను ఎలాంటి ఆదేశాన్ని ఇవ్వలేనని తెలిపింది. తమిళనాడుకు చెందిన వేలు గాంధీ తన పిటిషన్ను తమిళంలో రాసి స్వయంగా కోర్టుకు హాజరై వాదించారు. ఒరిస్సాలో ఇటీవల జరిగిన మత కల్లోలానికి భారత దేశంలో విస్తృతంగా పాతుకుపోయిన కులవ్యవస్థే కారణమని వేలు ఆరోపించారు.
కాగా సుప్రీం కోర్టు బెంచ్ సభ్యులైన జస్టీస్ పి సదాశివం, జస్టీస్ అఫ్తామ్ ఆలమ్ ఈ పిల్పై తమిళంలో స్పందిస్తూ, ఈ విషయంలో అపెక్స్ కోర్టుకు పరిమితి ఉందని చెప్పారు. తను దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై తాము ఎలాంటి ఆదేశం ఇవ్వలేమని బెంచ్ చెప్పినప్పుడు గాంధేయవాది వేలు గాంధీ ప్రశాంతంగా కోర్టు రూము వదలి వెళ్లి పోవడం గమనార్హం.
అహింసామూర్తి అయిన ఈ గాంధేయవాదికి కోర్టు మరింత వివరణ ఇచ్చి ఉంటే బాగుండేదేమో కదూ..