దేశ వాణిజ్య రాజధాని ముంబై మహానగరంలో కుండపోత వర్షాలు కురుస్తున్నాయి. గత కొన్ని రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. దీంతో రోడ్లు, రైల్వే లైన్లు, దిగువ ప్రాంతాలు నీటితో నిండిపోయాయి. ఈ కారణంగా భారత వాతావరణ సంస్థ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. వాతావరణం అనుకూలంగా లేనందున ముంబైలోని ఛత్రపతి శివాజీ మహరాజ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. దీనివల్ల దాదాపు 250కి పైగా విమాన సర్వీసులపై ప్రభావం పడినట్లు అధికారులు పేర్కొన్నారు. ఉదయం 9 గంటల నుంచి 9.50 గంటల ప్రాంతంలో 8 విమానాలను దారి మళ్లించినట్లు తెలిపారు. విమాన సర్వీసులు సగటున 45 నిమిషాల పాటు ఆలస్యంగా నడుస్తున్నట్లు వెల్లడించారు. ఈ మేరకు ఎయిర్పోర్టు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేసింది. విమానాల సమయాలను సంబంధిత వెబ్సైట్లలో చెక్ చేసుకోవాలని సూచించింది.
పలు విమానయాన సంస్థలు ప్రయాణికులకు అడ్వైజరీ జారీ చేశాయి. వరదల కారణంగా కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోవడంతో ముందుగానే ఇళ్ల నుంచి బయల్దేరాలని సూచించాయి. మరోవైపు భారీ వరదలకు రైలు పట్టాలు నీట మునిగిపోవడంతో ముంబై లోకల్ రైళ్లను రద్దు చేసినట్లు రైల్వే అధికారులు పేర్కొన్నారు.
భారీ వర్షాల కారణంగా పాఠశాలలు, కళాశాలలు, పలు ప్రభుత్వ కార్యాలయాలకు రాష్ట్ర ప్రభుత్వం సెలవు ప్రకటించింది. ప్రైవేటు ఉద్యోగులు వర్క్ఫ్రం హోం చేసుకోవాలని సూచించింది. అవసరమైతే తప్ప ప్రజలకు బయటకురావద్దని ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) విజ్ఞప్తి చేసింది.
గత 24 గంటల్లో, నగరంలోని అనేక ప్రాంతాల్లో 200 మి.మీ కంటే ఎక్కువ వర్షపాతం నమోదైనట్లు భారత వాతావరణ శాఖ తెలిపింది. విఖ్రోలి ప్రాంతంలో అత్యధికంగా 255.5 మి.మీ వర్షపాతం నమోదైనట్లు పేర్కొంది. భారీ వర్షపాతం కారణంగా గంటకు 40-50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని.. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.