Publish Date: Fri, 15 Mar 2019 (12:34 IST)
Updated Date: Fri, 15 Mar 2019 (14:20 IST)
ఈ కాలంలో పెద్దలు ఎలా చేస్తున్నారో వారి పిల్లలు కూడా అలానే చేస్తుంటారు. అంటే.. తల్లిదండ్రులతో పాటు అర్ధరాత్రి వరకు మేల్కొంటున్న రోజులివి. ఇలా చేయడం పిల్లల ఆరోగ్యానికి మంచి కాదంటున్నారు వైద్యులు. ముఖ్యంగా స్థూలకాయ వ్యాధి బారిన పడే అవకాశాలు చాలా ఎక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. ఈ వ్యాధి బారిన పడకుండా ఉండాలంటే.. ఏం చేయాలో చూద్దాం..
మీ ఇంటి పనులు పూర్తి చేయడానికి వీలుగా పిల్లలను కట్టిపడేసేందుకు టీవీలకు, ఫోన్లకు అలవాటు చేయకూడదు. వాటికి అతుక్కుపోయి వాళ్లు నిద్రకు దూరమవుతారు. కనుక టీవీ, ఫోన్లు చూసేందుకు కచ్చితమైన సమయాన్ని మాత్రం నిర్ణయించడం ఎంతైనా ముఖ్యం. నిద్రపోవడానికి కనీసం రెండు గంటల ముందే వాటికి దూరంగా ఉండేలా చూడడం మీ పనిగా పెట్టుకోవాలి.
పిల్లలు తీసుకునే ఆహారం నిద్రలేమికి మరో కారణం కావొచ్చు. రాత్రివేళ ఘనపదార్థాలు, మసాలాతో తయారుచేసిన వంటకాలు మంచివి కావు. తేలికగా జీర్ణమయ్యే ఆహారాన్ని వారికి అందివ్వండి. అప్పుడే భారీగా అనిపించకుండా హాయిగా పడుకుంటారు. అంతేకాదు, మెదడును తేలికపరిచే ఎండార్ఫిన్లు విడుదలవుతాయి.
నాన్న ఇంటికి ఆలస్యంగా వస్తారనో.. అమ్మకి ఇంకా పనులు పూర్తవ్వలేదనో అర్ధరాత్రివరకు పిల్లల్ని మెలకువగా ఉండనివ్వకూడదు. మీ పనులేలా ఉన్నా పిల్లలు వేళకు నిద్రపోయి లేచేలా చూసుకోవడం చాలా ముఖ్యం. లేదంటే వాళ్లు ఉదయాన్నే నిద్రలేవలేరు. ఆ ప్రభావం వాళ్ల చదువులపై పడుతుంది. దాంతో అలసిపోయినట్లుగా ఉంటారు. చురుకుదనం కూడా తగ్గుపోతుంది.
webdunia
Publish Date: Fri, 15 Mar 2019 (12:34 IST)
Updated Date: Fri, 15 Mar 2019 (14:20 IST)