Publish Date: Wed, 13 Mar 2019 (12:42 IST)
Updated Date: Wed, 13 Mar 2019 (12:45 IST)
అప్పుల బాధ తట్టుకోలేక ఇద్దరి ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. చావు ప్రయాణంలో కూడా భార్యాభర్తలు ఇద్దరూ కలిసే వెళ్లారు. బ్రతుకు తెరువు కోసం దుబాయ్ వెళ్లి అప్పులతో తిరిగి వచ్చాడు ఇంటి యజమాని.
ఈ వివరాలను పరిశీలిస్తే, కామారెడ్డి జిల్లా సదాశివనగర్ మండలం దగ్గి గ్రామానికి చెందిన కుర్మ శివరాజయ్య(42) బ్రతుకు తెరువు కోసం మూడేళ్ల క్రితం దుబాయ్ వెళ్లాడు. అక్కడ పని దొరకక అప్పుల బాధతో తిరిగి వచ్చాడు. రుణదాతల ఒత్తిడి ఎక్కువవడంతో తన కొడుకుని దుబాయ్ పంపించాడు. శివరాజయ్య, అతని భార్య లింగవ్వలు అప్పుల విషయమై బాధపడుతూ సోమవారం రాత్రి నిద్రకు ఉపక్రమించారు.
శివరాజయ్య నిద్రపోతుండగా లింగవ్వ అతనికి తెలియకుండా పురుగుల మందు తాగింది. భర్తకు మెలుకువ వచ్చి చూడగా ఆమె కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతూ చనిపోయింది. ఆ ఘటన చూసి శివరాజయ్యకు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మరణించాడు.