Publish Date: Tue, 17 Jan 2023 (10:44 IST)
Updated Date: Tue, 17 Jan 2023 (10:47 IST)
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని నెల్లూరు జిల్లా శ్రీహరికోటలో సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్) విభాగానికి చెందిన ఇద్దరు జవాన్లు ఆత్మహత్య చేసుకున్నారు. గడిచిన 24 గంటల్లో వీరిద్దరు బలవన్మరణానికి పాల్పడ్డారు. స్థానికంగా ఉండే ఇస్రో అంతరిక్ష పరిశోధనా కేంద్రంలో విధులు నిర్వహిస్తూ వచ్చిన ఈ ఇద్దరు జవాన్లు సోమవారం ఆత్మహత్య చేసుకున్నారు. మృతుల్లో ఒకరిని వికాస్ సింగ్ (33)గా గుర్తించారు. ఈయన తన సర్వీస్ రివాల్వర్తో కాల్చుకుని ప్రాణాలు తీసుకున్నాడు.
మరో జవాను పేరు చింతామణి (29). ఈ జవాన్ ఇస్రో కేంద్రంలోని ఒక చెట్టుకు ఉరేసుకుని ప్రాణాలు తీసుకున్నాడు. వీరిద్దరూ తమతమ వ్యక్తిగత కారణాల కారణంగా ఆత్మహత్య చేసుకున్నారు. అయితే, ఉన్నతాధికారుల వేధింపుల కారణంగా వీరు ఆత్మహత్య చేసుకుని ఉండొచ్చంటూ వచ్చిన వార్తలను పోలీసులు కొట్టిపారేశారు. దీనిపై స్థానిక పోలీసులు కేసు నమోదు చేసి విచారణ జరుపుతున్నారు.